హరిదాసు

హరిదాసు 15వ శతాబ్దానికి చెందిన భక్తుడు. పుట్టుకతో మహమ్మదీయుడైన అతడు హరినామ సంకీర్తనచే ఆకర్షితుడై, శ్రీకృష్ణ భక్తుడిగా మారాడు. చిన్నతనంలోనే తూర్పు వంగదేశంలోని అద్వైత ఆచార్యుని మహత్వాన్ని తెలుసుకొని, ఆయనని దర్శించడానికి వెళ్ళాడు.

ఆచార్యుడు: రా నాయనా! నీపేరేమిటి?

హరిదాసు: నేనొక అనాథను స్వామీ!

ఆచార్యుడు: లోకంలో అనాథ అంటూ ఎవరూ లేరు నాయనా! నువ్వు హరి కుమారుడవు. ఇకనుంచి నిన్ను అందరూ హరిదాసు అనే పేరుతో పిలుస్తారు. హరినామ స్మరణచేస్తూ వుండు.
హరిదాసు నిత్యం మూడు లక్షల హరిజపం చేయసాగాడు. భక్తితో, వినమ్రతతో ఆచార్యుని ప్రేమాదరణలను చూరగొన్నాడు.
ఒకనాడు శిష్యులు ఆచార్యా! ఎంత ప్రయత్నించినప్పటికీ ఎక్కడా అగ్ని లభించలేదు. ఏం చేయాలి?

ఆచార్యుడు: అలాగా! నీ అహంకారాన్ని వదిలిపెట్టి ఎండిన గడ్డి తీసుకొని హరిదాసు వద్దకు వెళ్ళి అగ్ని తీసుకురండి.

శిష్యులు ఎండుగడ్డితో హరిదాసు వద్దకు వెళ్ళారు.

హరిదాసు: కృష్ణా! హే ప్రభో! ఎండి పడి ఉన్న మా హృదయాలలో నీ ప్రేమను నింపినట్లుగా ఈ ఎండుగడ్డిని అగ్నితో నింపవా?

శిష్యులు: ఆహా! అగ్ని వచ్చేసిందే. హరిదాసూ! మా హృదయాలలోనూ ప్రేమ పొంగుతున్నదే!
ఒకసారి వీధిలో హరిదాసు నామసంకీర్తనం చేస్తూవుంటే, భక్తులు వింటూ స్థాణువులై నిలబడిపోయారు. ఆ సమయంలో గర్విష్ఠి అయిన ఓ జమీందార్ ఆ దారిలో వస్తూ..
ఏమిటి? నారాకను గుర్తించకుండా, దారికి అడ్డుగా నృత్యం చేస్తున్న వీడెవడు.? నన్ను లక్ష్యపెట్టని ఈ వేషధారిని అరణ్యంలో విడిచిపెట్టి రండి.
అరణ్యంలో విడిచిపెట్టినప్పటికీ హరిదాసు భగవన్నామ సంకీర్తనాన్ని ఆపలేదు. భటులు మరుగున ఉండి గమనించసాగారు. అప్పుడు ఒక వింత జరిగింది.
సింహం, పులి కూడా హరిదాసు గానానికి మంత్రముగ్ధమై నిలబడిపోయాయి. ఈయన నిజమైన భక్తుడే! రండి! జమీందారుకు చెబుదాం అని వెళ్ళారు భటులు.
భటులు చెప్పింది జమీందారు నమ్మలేదు. అతడు హరిదాసును ఇంకా పరీక్షించాలని, ఒక వేశ్యను అతడివద్దకు పంపాడు.
హరిదాసు తన కుటీరం ముందు కూర్చొని జపం చేసుకుంటున్నాడు.

వేశ్య: ప్రభూ! నిరాహారిగ ఉంటూ, అవిశ్రాంతంగా ఇలా జపంలో నిమగ్నమైపోతే శరీరం క్షీణిస్తుంది. ఈ పాలు అయినా కొంచెం స్వీకరించండి స్వామీ!

హరిదాసు: ఎవరమ్మా నువ్వు? హరినామం అనే అమృతాన్ని పానం చేసిన తరువాత అలుపు వుంటుందా? సంకీర్తనలో నువ్వూ పాల్గొను. అప్పుడే దాని రుచి ఏమిటో గ్రహించగలవు.
హరిదాసుతో కలిసి భజన చేస్తున్నట్లు ఆమె నటించింది. కానీ కృష్ణుని లీలల్ ఆమెను కూడా ఆకట్టుకున్నాయి. ఆమెలోని దురుద్దేశం మటుమాయమైంది. ఒకరోజు…
ఏం ఆశ్చర్యం ఇది! ప్రక్కన ఒక యువతి ఉన్నదన్న సంగతికూడా పట్టించుకోకుండా హరినామాన్నే శ్వాసగా చేసుకొని జీవిస్తున్నాడే ఈయన! ఈయనకు సేవ చేస్తే నేను పవిత్రురాలిని అవుతాను అనుకుంది.

జమీందారుకు ఈ విషయం తెలిసింది. ఏమిటి!మనం పంపిన ఆ వేశ్య కూడా ఆ వేషగానితో కలసి వీధుల వెంట పాడుకుంటూ పోతున్నదట!

భటులు: అంతేకాదు ప్రభూ! ఆమె తన సంపదనంతా బీదలకు దానం చేసేసింది.
వాళ్ళను ఊరికే వదిలిపెట్టకూడదు. అనుకొని ప్రభుత్వ అధికారి ఖాజీకి ఫిర్యాదు చేస్తారు.

అధికారి: ఏయ్ హరిదాస్! ముస్లిం అయిన నువ్వు హైందవుడవ్వడం మొదటి అపరాధం. స్త్రీతో ఆడిపాడుతూ ఉండడం రెండో అపరాధం.

హరిదాసు: ఖాజీ మహాశయా!హరినామ సంకీర్తనం నా ఊపిరి, దానిలో లీనమై కృష్ణానుభూతిని పొందుతున్నాను. మనుష్యులే కాదు, జంతువులు కూడా ఆ అనుభూతి కోసం ప్రయత్నిస్తున్నాయి.

అధికారి: అనవసరంగా వాగకు. క్షమాపణ కోరి ఇక పాడనని వాగ్దానం చెయ్యి.

హరిదాసు: నా ఊపిరి అయిన సంకీర్తనను చేయకుండా జీవించగలనా?

అధికారి: ఈ మొండివాడికి కొరడా దెబ్బలు తగిలించి, నదిలో విసిరివేయండి.
కొరడా దెబ్బలు కొట్టి, హరిదాస్ను నదిలో విసిరివేశారు. తేలుతూ వచ్చిన అతడు ఒక చెట్టు కొమ్మలో చిక్కుకుపోయాడు.
ఆ సమయంలో పడవలో అక్కడకు వచ్చిన ఖాజీ ఆ పరిస్థితులలో కూడా నామ సంకీర్తనం చేసున్న ఆ దృశ్యం చూసి అతణ్ణి కాపాడాడు.
యా అల్లా! ఇతడికి ఎంతటి ప్రగాఢమైన భగవత్ విశ్వాసం ఉంటే గానీ ఈ పరిస్థితులలోనూ భగవన్నామాన్ని స్మరించడాం సాధ్యమవుతుంది? ఇతడు ఉత్తమోత్తముడ్ అనుకొని హరి భాయ్! మీ మహత్వాన్ని గ్రహించలేక దారుణంగా ప్రవర్తించిన నన్ను క్షమించ ప్రార్థన అని వేడుకొన్నాడు.

హరిదాసు: అంతా కృష్ణుని కరుణాకటాక్షమే!
హరినామాన్ని నిత్యం మూడులక్షల పర్యాయాలు జపించడం వల్ల ఆయనను ’నామాచార్యులు’ అని పేర్కొన్నారు.
హరిదాసు తరువాత పూరీకి వెళ్ళి శ్రీచైతన్యులను దర్శించారు. హరిదాసూ, చైతన్యుల మరో శిష్యుడైన నిత్యానందుడూ నామసంకీర్తన ఉద్యమంలో ముఖ్యపాత్ర వహించార్.
హరిదాసు అప్పటిదాకా ఏదో కారణంగా పూరీజగన్నాథుని దర్శించలేదు. అది గ్రహించి శ్రీచైతన్యులు ఒక రోజు అతణ్ణి పిలిచి

హరిదాసూ! అదిగో చూడు. పూరీ జగన్నాథ ఆలయపతాకానికి ప్రణామం చేస్తూ ఆనందంతో నామసంకీర్తన చేస్తూ వుండు.

హరిదాసు: ప్రభూ! మీదర్శనం లేకుండా నేనెలా జీవించగలను?

శ్రీచైతన్యులు: దిగులు చెందకు. నిత్యం నిన్ను చూడడానికి నేనే ఇక్కడకు వస్తాను. దానికి తోడు దైవప్రసాదం కూడా తప్పక నీకు లభిస్తుంది. శ్రీచైతన్యులు జగన్నాథునిగానే నిత్యమూ దర్శన భాగ్యం అనుగ్రహించారు. ఇద్దరూ గంభీరగుహ అనే స్థలంలో వుండి భాగవతం పఠిస్తూ వచ్చారని చెబుతారు.
అంతిమ దినం నాడు హరిదాసు తన గురువు పాదపద్మాలను హృదయంలో నిలుపుకొని, ’శ్రీకృష్ణ చైతన్య” అంటూ హరిలో లీనమయ్యారు. ఆయన పావన దేహానికి సముద్రంలో స్నానమాచరించి శ్రీచైతన్యులే అంత్యక్రియలు జరిపించారు. హరిదాసు స్పర్శతో ఈ సముద్రం మహాతీర్థం అయింది. ఇక్కడ హరిదాసుకు ఒక స్మారక మందిరం నిర్మించాలి. పూరీ సముద్ర తీర సమీపాన అందంగా నిర్మించిన హరిదాసు సమాధిని నేటికీ భక్తులు సందర్శిస్తున్నారు.
తెలిసిగానీ, తెలియక గానీ – ఏ స్థితిలో వున్నా భగవన్నామాన్ని ఉచ్చరిస్తే దానివల్ల సత్ఫలితం తప్పక కలుగుతుంది. భగవన్నామం అత్యంత శక్తిమంతం

Make any Suggitions