అభిషేకఫలం


పరమశివునికి ఉన్న అనేక పేర్లలో ” ఆశుతోషుడు” ఒకటి !ఆస్తోషుడు అంటే స్వల్ప మాత్రానికే సంతోషించేవాడని అర్ధం.అందుకే శ్రీనాధ సార్వ భౌముడు స్వామి భక్తసులభుడు అని ఈ కృంద విధముగా వర్ణించాడు.
శివుని శిరమున కాసిన్ని నీళ్ళు జల్లి
పత్తిరిసుమంత నెవ్వాడు పారవైచు
కామధేనువతడింట గాడి పసర
మల్ల సురశాఖి వానింట మల్లేచెట్టు

 

fdghf

dfghds


అంటే శివుని శిరస్సుపైన కాసిన్ని నీళ్ళు జల్లి, కాస్తంత పత్రిని వేసినంత మాత్రానికే , ఆ భక్తుని ఇంట కామధేనువు గాట కట్టిన పశువు అవుతుందట.
అలాగే దేవతా వృక్షము అయిన కల్ప తరువు ఆ భక్తుడి ఇంట మల్లే చెట్టు అవుతుందట!

ఆ స్వామి అభిషేకప్రియుడు.

ఆయ్నకి వివిధ ద్రవ్యాలతో చేసే అభిషేకం వివిధ ఫలితాలను కలుగ చేస్తుంది అని శాస్త్ర వచనం

  1.  శివునికి నెయ్యతో భిషేకం చేస్తే ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది.
    పెరుగు తో అభిషేకం చేస్తే కీర్తి, ఆరోగ్యం కలుగుతాయి. 
  2. తేనెతో అభిషేకం చేస్తే తేజస్సు వృద్ధి కలుగుతుంది.
  3. చెరకు రసంతో అభిషేకం ధనవృద్ధి!
  4. పంచధార తో చేస్తే దుఃఖ నాశనం!
  5. కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తే సర్వ సంపదల వృద్ధి,
  6. విభుతి నీటి తో చేసే అభిషేకం మహా పాపాలను నశింపచేస్తుంది.
  7. నవరత్న జలాభిషేకం ధనధాన్య ,పశుపుత్ర లాభాన్ని,
  8. మామిడి పండ్ల రసంతో చేసే అభిషేకం చర్మ వ్యాధుల నిర్మూలనం,
  9. పసుపు నీరు తో చేసే అభిషేకం సౌభాగ్యాన్ని కలిగిస్తాయి.
  10. నువ్వుల నూనేతో అభిషేకిస్తే అపమృత్యువు భయం తొలగిపోతుంది.
  11. పుష్పోదకాభిషేకం భూలాభాన్ని , బిల్వ జలాభిషేకం భోగభాగ్యాలను ప్రసాదిస్తాయి.
  12. రుద్రాక్ష ఉదకంతో చేసే అభిషేకం ఐశ్వర్యాన్ని,
  13. గరికి నీటి తో అభిషేకం చేస్తే ధన కనక వస్తువులు, మరియూ వాహనాలను ప్రసాదిస్తుంది.
  14. సువర్ణ ఉదకాభిషేకం దారిద్ర్యాన్ని పోగొడుతింది.
  15. కస్తురికా జలాభిషేకం చక్రవర్తిత్వాన్ని ప్రసాదిస్తుంది
  16. హర హర మహా దేవ షంభో శంకర!

భార్య తప్పు చేస్తే దిద్దుకున్నవాడు భర్త


భార్య పొరపాటు చేసిందని ఆమెను విడిచిపెట్టిసినవాడు ఆర్షసంప్రదాయమందు భర్త కాదు. భార్యగా అహల్యచేసిన పొరపాటు కంటె పెద్ద పొరపాటు మరొకటి చరిత్రలో ఉండదు.

అహల్యకు దేవరాజుమీద మనస్సు ఎందుకు కలిగింది? ఆయన ఐశ్వర్యవంతుడని. ఐశ్వర్యవంతుడన్న భావన ఎందుకు కలిగింది? మనస్సు ఉండబట్టి. మనస్సు ఎందుకు వచ్చింది? ఆహారాన్ని తినబట్టి. ఆహారంలో ఆరవవంత్ మనస్సు అయింది. మనస్సునుండి మోహము, మోహమునుండి లోభము వచ్చాయి. లోభానికి కామం కలిసింది. కామం కలిసి అహల్య మనస్సును దేవరాజు వైపు వెళ్ళేలా చేశాయి. అందుకని ముందుగా అహల్య మనసు శుద్ధికావాలి. అందుకని గౌతముడు అహల్యని –

వాయుభక్షా నిరాహారా తప్యంతీ భస్మశాయినీ!
అదృశ్యా సర్వభూతానా మాశ్రమేస్మినివత్స్యసి!!

“నువ్వు అన్నం తినకు. గాలిపీల్చు. నీపాపం పోవాలి. నువ్వు అగ్నిపునీతవు అవ్వాలి. అందుకని నువ్వు కొన్నివేల సంవత్సరాలు తపస్సు చెయ్యి. నీకు బాహ్యప్రపంచం తెలియకూడదు. నీ ఒళ్ళంతా బూదితో కప్పబడుతుంది. కప్పబడి నువ్వలా భూమిమీద పడిపోయి ఉండిపోతావు.” రాబోయే అవతారాన్ని గౌతముడు ముందుగానే గుర్తించాడు. “పతితపావనుడయిన రామచంద్రమూర్తి ఇక్కడకు వస్తారు. అయన ఇక్కడకు ఆశ్రమంలోకి రాగానే ఆయన గాలి నీకు సోకుతుంది. నువ్వు శాపవిముక్తురాలివి అవుతావు” అన్నాడు.

అహల్యను ’రాయి అయిపోవలసినది’ అని గౌతముడు శపించినట్లు వాల్మీకి రామాయణంలో ఎక్కడా లేదు.

ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఒకటి ఉంది. దేవాలయానికి వెళ్ళడం ఎందుకు? స్వామి పతితపావనుడు. ఆయనమీద నుండి వచ్చేగాలి మనకు సోకితే చాలు మన పాపాలు నశిస్తాయి. అందుకని దేవాలయాలలోకి వెళ్ళి మనం స్వామిముందు నిలబడతాం.

మహానుభావుడు శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారంటారు వారి రామాయణ కల్పవృక్షంలో –

ప్రభుమేని పైగాలి పై వచ్చినంతనే పాషాణమొకటిక స్పర్శ వచ్చె
ప్రభుకాలి సవ్వడి ప్రాంతమైనంతనే శిలకొక్కదానికి చెవులు కలిగె
ప్రభు మేని నెత్తావి పరిమళించినతోన యశ్మంబు ఘ్రాణేంద్రియంబు చెందె
ప్రభు నీలరత్న తోరణమంజులాంగంబు కనవచ్చి రాతికి కనులు కలిగె
ఆ ప్రభుండు వచ్చి ఆతిథ్యమును స్వీక
రించినంత హృదయనుపల వీధి
ఉపనిషద్వితానమొలికి శ్రీరామ భ
ద్రాభిరామమూర్తియగుచుతోచె!!

ఎప్పుడయినా సరే, మనం అహల్య వ్యభిచరించింది అనకూడదు. అలా అనడానికి మనకు హక్కులేదు. కొన్ని వందల సంవత్సరాలు ఆమె నిరాహారియై తపస్సు చేసింది. తదుపరి శ్రీరామదర్శనం చేసింది. శ్రీరామదర్శనానంతరం ఆమె పాపము పూర్తిగా నశించిపోయింది. ఆమెయందిప్పుడు పాపము లేదు. అటువంటి తల్లి కనుకనే శాపవిమోచనానంతరము రామచంద్రుడే ముందుగా ఆమెకు నమస్కరిస్తాడు. రామచంద్రమూర్తిచేత నమస్కరింపబడిన మహాతల్లి అహల్య. అహల్య పేరు వినబడితే రెండుచేతులు ఎత్తి నమస్కరించాలి. ఆమె గొప్పతనం గూర్చి చెప్పడానికే రాముడంతటివాడు ఆమెకు ముందు నమస్కారం చేశాడు. తన భార్య తప్పుచేస్తే ఆ భార్య చేత తపస్సు చేయించి ఎందువల్ల ఆ భార్య ఆదోషాన్ని చేసిందో గమనించి, ఆ దోషాన్ని నివృత్తి చేసి రాముడు వస్తే ఎలా పతితపావనుడో చూపించారు విశ్వనాథ సత్యనారాయణ గారు. అందుకనే ఋషితుల్యుడు అయ్యాడు మహానుభావుడు. అప్పటివరకు బాహ్యస్పర్శలేకుండా పడిపోయిన అహల్యకు రామచంద్రమూర్తి నుండి గాలివచ్చి తగిలిందిట. అంతే. ఆమెకు ఇప్పుడు స్పర్శ కలిగింది. ఇప్పటివరకు ఆవిడకు స్పర్శలేదు. ఇప్పటివరకు అసలు ముక్కుకు వాసన తెలియకుండా పడిపోయిన అమ్మకి రామచంద్రమూర్తి మీది నుంచి వచ్చిన పరిమళమయిన వాయువు తగలగానే ముక్కుకి సువాసన తెలియడం ప్రారంభమయినదట. ఆయననుంచి గాలివచ్చి తగలగానే మరల స్పర్శేంద్రియము పనిచేయడం ప్రారంభించినదట. నీలమేఘసంకాశమయిన రామచంద్రమూర్తి సౌందర్యమును చూడగానే ఆవిడ కనులు పనిచేయడం మొదలుపెట్టాయట. ఆవిడిలోంచి శబ్దస్పర్శ రూప గంధములనే నాలుగు తన్మాత్రలు ప్రారంభమయ్యాయి. మరి రసేంద్రియమయిన నాలుక ఎప్పుడు పని చేస్తుంది. ఇప్పుడు ఇన్నాళ్ళు తపస్సు చేసి లేచింది కాబట్టి లేచి తిన్నప్పుడు కాదట! ఆ రాముడికి పళ్ళు, ఫలములు, పాలు అన్నీ ఇచ్చినప్పుడట! ఆయన తింటే ఈవిడ రసేంద్రియము పనిచేయడం మొదలు పెట్టిందట! ఇపుడు ఏమయింది? ఆహారదోషం, శరీరదోషం అన్నీ నివృత్తి అయిపోయాయి. ఇప్పటివరకు రాముడు రాముడే. శ్రీరాముడు కాదు. సీతతో కలిసిన రాముడు కాదు. లక్ష్మి సీతమ్మగా అక్కడ మిథిలానగరంలో ఉంది. వారిద్దరూ తొందరలో కలియబోతున్నారు. సీతారాములుగా మాకు దర్శనం ఇవ్వబోతున్నారు. అని దర్శనము చేసిన గొప్ప చారిత్రము కలిగి, తన పాపములనన్నిటిని ప్రక్షాళనము చేసుకున్న మహాపతివ్రత అహల్య. ఇటువంటి అహల్య కాళ్లమీద రాముడు పడ్డాడు.

భార్య తప్పు చేస్తే ఉద్ధరిమ్చుకున్నవాడు భర్త. అంతేకాని పాిగ్రహణం చేసి అస్తమానూ చిన్నదానికి చితకదానికి కూరలో ఉప్పు దగ్గరనుండి ప్రతిదానికీ భార్యను పట్టుకుని నిందించేవాడు భర్త కాడు. భార్య తప్పు చేస్తే దిద్దుకున్నవాడు భర్త.

మహర్షి అష్టావక్రుడు


శ్రీకృష్ణుని జీవితముతో సంబంధమున్న ఒక విఖ్యాత మహర్షి అష్టావక్రుడు. ద్వాపర యుగంలో ద్వారకలో శ్రీకృష్ణుడు ఉన్న రోజులలో ఆయనను వెదుక్కుంటూ ఒకరోజు అష్టావక్ర మహర్షి వచ్చాడు. ఆయన శ్రీకృష్ణుని దర్శించి ధ్యానయోగంలో నమస్కరించాడు. శ్రీకృష్ణుడు ఆయనను ఆహ్వానించి గౌరవించాడు. అర్ఘ్య పాద్యాలు ఈయబోతున్న సమయములో కృష్ణుని పాదాలపై శిరస్సు ఉంచి ఆయన శరీరాన్ని వదలిపెట్టాడు. శ్రీకృష్ణుడు స్వయముగా ఆయనకు అంత్యక్రియలు జరిపించి, ఉదకములిచ్చి, ఆజీవునికి ఎంతోగౌరవమైన సద్గతిని ఇచ్చాడు. అప్పుడు శ్రీకృష్ణుని పత్నులు, మంత్రులు అందరూ, ఆయన చరిత్రను చెప్పమని కృష్ణుని అడిగారు. అప్పుడు ఆయన జన్మ వృత్తాంతాన్ని ఇలా చెప్పాడు.

“ఈ అష్టావక్రుడు నాకు పరమభక్తుడు. జితేంద్రియుడు. పూర్వము నేను నాభి కమలమునుండి బ్రహ్మను సృష్టించి విశ్వసృష్టిచేయమని అతనిని నియోగించాను. అతడు మొదట సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులనే నలుగురు మానస పుత్రులను సృష్టించాడు వారు తపోన్ముఖులై సృష్టికార్యాన్ని తిరస్కరించారు. తరువాత బ్రహ్మదేవుడు వశిష్ఠ, మరీచి, ప్రచేతస, అంగీరసాదులైన మహర్షులనూ, ప్రజాపతులను సృష్టించాడు. వారుకూడా మొదట తపస్సులుచేసినా బ్రహ్మ ఆజ్ఞను శిరసావహించి వివాహములు చేసుకొని సంతానమును కన్నారు. ప్రచేతసుని కుమారుడు అసితుడు. అతడు రుద్రుని గురించి తపస్సు చేస్తే రుద్రుడు ప్రత్యక్షమై రాధా మంత్రాన్ని ఉపదేశించాడు. రాధాదేవి అనుగ్రహముతో అతనికి కలిగిన కుమారుడు దేవల మహర్సి. ఆ దేవలమహర్షి తీక్షణమైన తపస్సు చేస్తే, ఇంద్రుడు తపోభంగము చేయమని రంభను పంపాడు. రంభను ఆయన తిరస్కరిస్తే, ఆమె అష్టావక్రునిగా జన్మించమని దేవలుని శపించింది. ఏకపాదుని కుమారుడుగా ఆయన జన్మించి మహాజ్ఞానిగా, దివ్య చరితుడైనాడు. కృష్ణుని సన్నిధిలో ప్రాణాలు వదలాలనే సంకల్పంతోనే ఆయన జన్మించాడు.”

జగతిని మ్రింగే కాలమే భోజనపాత్రగా కలిగినవాడు


శ్రీకృష్ణపరమాత్మ ధర్మరాజాదులకు ఉపదేశిస్తున్న శివ సహస్రనామాలలో 683వ నామం జగత్కాల స్థాలః. ఇది నమస్కారంలో జగత్కాల స్థాలాయ నమః అని చెప్పబడుతున్నది. స్థాలః అంటే పాత్ర అని అర్థం. భోజనపాత్రను స్థాల అని అంటాం. ఇప్పటికీ మనం స్థాళీపాకం అంటూంటాం. స్థాలః అంటే భోజనపాత్ర అని అర్థం.

Namah sivaya

పరమేశ్వరునికి ఒక భోజనపాత్ర ఉందిట. ఆ భోజనపాత్ర యేమిటంటే జగత్కాలమే ఆయనకు భోజనపాత్ర అన్నారు. చాలా గొప్ప విశేషం ఇది. జగత్-కాల-స్థాలః – ఈ కూర్పే చాలా చిత్రం. కాల స్థాలః అంటే అయిపోయేది కదా! కానీ జగత్కాల స్థాలః అని ఎందుకు అన్నారు అంటే జగతిని మింగేది యేదో అది కాలము. అలాంటి కాలము ఆయనకు భోజనపాత్రగా ఉందిట. కాలమే భోజనపాత్రగా ఉన్నది. ఈకాలంలో ఉన్న భోజనం జగత్తు. జగత్తు అనే భోజనం కాలంలో ఉంటే ఆ కాలాన్ని పాత్రగా పట్టుకున్నాడట. ఇది చెప్పేటప్పుడు మనకి ఒక అపురూపమైన భావన కనపడుతోంది. శాస్త్రప్రకారం సృష్టిస్థితిలయకారకుడు పరమాత్మ. ఈ లయం చేయడమే భోజనం చేయడం. అందుకే పరమేశ్వరుని ఆ భోజన లక్షణాన్ని శాస్త్రం అనేక రకాలుగా వర్ణించింది. మహాప్రపంచాన్నంతటినీ మ్రింగివేస్తాడట ప్రళయకాలంలో. ఎలాగైతే ఒక రైతు పండించి, పెంచి, తిరిగి మింగుతాడో అలా అది ప్రపంచాన్ని పుట్టించి పోషించి లయం చేస్తాడు. లయం చేసేటప్పుడు ప్రపంచం ఆయనకు భోజనం అయిపోయింది. ఆ సమయంలో ప్రపంచం ఉండే పాత్ర కాలము. చాలా చక్కటి మాట చెప్పారు. ప్రపంచం అందరికీ కనపడుతుంది. కానీ కాలం మాత్రం కనపడదు. కనపడదు కానీ లేదు అని మాత్రం ఎవరూ అనలేరు. కాలం స్థూలవస్తువా? కనపడుతోందా? లేదు అని అనగలమా? ఇక్కడ మనం పరిశీలిస్తే జగత్తంగా కాలమునందే ఉన్నది. కాలంలో లోకం ఉంటే కాలం ఆయన చేతిలో ఉన్నదిట. కాలాన్ని ఆయన శాసిస్తున్నాడు. కాలం ప్రకారం భోజనం చేస్తాడు. అంతేగానీ అడ్డదిడ్డంగా ఈ సృష్టిని ఎప్పుడుపడితే అప్పుడు నశింపచేయడం కాదు. దానికొక కాలం ఉంది. కనుక ఆ కాలాన్ని ఆధారం చేసుకొని ఈ ప్రపంచాన్ని పట్టాడాయన. అది భోజనపాత్రగా కలిగినటువంటివాడు. జగతిని మ్రింగే కాలమే భోజనపాత్రగా కలిగినవాడు. ఇది జగత్కాల స్థాలాయనమః అనే విషయం చెప్తుంది.

కొందరంటూంటారు భగవంతుడిని యేమీ కోరుకోకూడదు అని. అది చాలా తప్పు మాట.


అమ్మవారిని ఏదైనా కోరిక కోరుకున్నప్పుడు యేమి కోరుకున్నామో అవి బాధించకుండా కాపాడతాయి. అమ్మవారిని లౌకిక కోరికలు కోరుకుంటే ప్రయోజనం యేమిటంటే అవి మనల్ని మోహంలో బంధించవు, బాధించవు. అందుకు లౌకికమైన కోరికైనా అమ్మవారిని అడగవచ్చు. కొందరంటూంటారు భగవంతుడిని యేమీ కోరుకోకూడదు అని. అది చాలా తప్పు మాట. కోరికల కోసం అమ్మవారి దగ్గరికి వెళ్ళను ఇంకొకరి దగ్గరికి వెళ్తాను అంటే మళ్ళీ ఇది తప్పే. మిగిలిన వారిని అడిగి కోరికలు తీర్చుకుంటే ఆ కోరికలు మనల్ని బంధిస్తాయి, బాధిస్తాయి. అమ్మవారి వల్ల తీర్చుకుంటే అమ్మవారి దయవల్ల వచ్చింది అనే స్పృహ ఉంటుంది. కృతఘ్నత అన్నది లేకపోతే. భగవంతుడి దయవల్ల అని నానుడిగా మనలో వచ్చేసింది. రామకష్ణ పరమహంస ఒక మాట అనేవారట – “అమ్మ దయవల్లే అన్నీ ఉన్నాయి, అమ్మ దయ ఉంటే అన్నే ఉన్నట్లే”. ఈ మాట అర్థం ఏది ఉన్నా అమ్మ దయే. అనుభవించే ప్రతిదానిలోనూ అమ్మనే ధ్యానం చేస్తున్నాం. గ్లాసు నీళ్ళు చేతితో పట్టుకుంటే ఇందులో దాహం తీర్చే శక్తిగా అమ్మ ఉంది. ఇలా ప్రతి పదార్థంలోను ప్రయోజనకారిగా అమ్మయే ఉన్నదనే భావం ’కామ్యా’ నామ విచారణ వల్ల కావాలి. నామాలకి అర్థం చెప్పుకోవడం లేదు. విచారణ చేస్తున్నాం.

కన్యాదానానికి ఎట్లాంటి వరుడు కావాలి.?


వదాన్యుడనే మునికి సుప్రభ అనే కుమార్తె ఉన్నది. అష్టావక్రుడు ఆమెను వివాహమాడగోరి వదాన్యుడిని అడిగాడు. ఆయన రూపగుణవర్తనాలలో యోగ్యుడైన అష్టావక్రుడికి కూతురుని ఇస్తానని మాట ఇచ్చి, అతడిని ఉత్తరదిశగా పయనించి పార్వతి శివుడి కొరకు తపస్సు చేసిన ప్రాంతం దాటి కదంబ వనంలో ప్రవేశించి, అక్కడ నివసించే ఒక పవిత్ర ప్రౌఢ వనితను దర్శించి తిరిగి రమ్మని కోరాడు. ఆ వెంటనే వివాహం చేస్తానన్నాడు. అష్టావక్రుడు దానికి అంగీకరించి ఆ రాత్రి బాహుదా నదీ తీరంలో ఆగి మరునాడు కుబేరనగరానికి పోయి ఆయన కల్పించిన వినోదాలను వీక్షిస్తూ నిశ్చలమనస్సుతో ఒక యేడాది గడిపి ఈశ్వరుడి క్రీడా క్షేత్రాలను దర్శించి కడిమిచెట్ల వనం చేరి బంగారు మేడలో నివసించే ఒక పవిత్ర వనితను దర్శించాడు. ఆమె అతడికి ఎన్నో అతిథి సత్కారాలను చేసింది. రాత్రి శయ్యపై అతడితో శయనించి భోగించుమని కోరింది. అష్టావక్రుడు తనను తాకకుండా ఉంటే ఉంటానని, లేకపోతే వెంటనే వెళ్ళిపోతానని అంటాడు. ఆరోజు మిన్నకుండి మరునాడు రాత్రి మరల అతడిని కోరింది. అష్టావక్రుడు ఇలా అన్నాడు. “స్త్రీని పసితనంలో తండ్రి, వివాహమైన తర్వాత భర్త, ముసలితనంలో కొడుకు రక్షిస్తారు తప్ప ఆమె స్వతంత్రంగా ఏమీ చేయ తగదు. కాబట్టి నేను నిన్ను స్వీకరించను” అన్నాడు. ఆమె ఎన్ని విలాసాలు ప్రదర్శించినా చలించలేదు. అప్పుడామె సంతోషించి తాను ఉత్తరదిశా కన్యనని వదాన్యుడి ఆనతితో అతనిని పరీక్షించానని చెప్పి అతడిని అభినందించి పంపింది. అష్టావక్రుడు తిరిగి వచ్చి వదాన్యుడి అభినందనలతో పాటు సుప్రభను భార్యగా పొంది సుఖించాడు. కాబట్టి కన్యాదానానికి అర్హుడు ఉత్తమ బ్రహ్మచారి.

కలిపురుష నివాస స్థానములు


  1.  మద్యపానం – కలి సంపర్కం ఉండడం చేత అది పుచ్చుకోగానే శుకపికబక రావములన్నీ వస్తాయి. నా అంతటి వాడు లేడన్న అహంకారంతో అవతలి వాడితో కలియబడి దెబ్బలాడతాడు. మద్యపానంలోనుంచి గర్వం వచ్చింది.
  2.  జూదము – జూదం నుండి అసత్యం వచ్చింది.
  3.  స్వేచ్ఛావిహరిణులైన స్త్రీలు – ఒక ప్రవర్తనకు నడవడికి కట్టుబడనటువంటి ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించే వాళ్ళు. వాళ్ళే ఇవాళ సందేశాలిచ్చే వాళ్ళు. వాళ్ళే ఇవాళ్ళ ప్రతిచోటా కనపడే వాళ్ళు, వాళ్ళ బొమ్మలే దేశంలో ఎక్కడ చూసినా పెద్దపెద్దవి పెట్టబడతాయి. ఏదైనా దుకాణం ప్రారంభించాలన్నా వాళ్ళే. దేశంలో ఒక గొప్ప విషయం చెప్పాలన్నా వాళ్ళే. ఇక చెప్పేవాడెవడూ లేనట్లు వాళ్ళే అన్నిచోట్లా కనపడుతూ ఉంటారు. వీరి వల్ల పురుషులకు ఉన్మాదముతో కూడిన కామము కలుగుతుంది. దాని వల్ల పురుషుడు కట్టుబాటు వదిలి తిరగడం మొదలవుతుంది. దానివల్ల కర్మబద్ధము కాని కామము ప్రచోదనమై దేశము భ్రష్ఠుపడుతుంది.
  4. వేట యందు హింస: వేట ధర్మము రాజుకి. కలిపురుషుడు ప్రవేశించడం చేత హింసాదృష్టి కోణము పెరుగుతుంది.
  5.  సువర్ణము – శతృత్వం వస్తుంది సువర్ణం వల్ల.

భగవంతుని పాదములు గట్టిగా పట్టుకున్న వాడు తప్ప వేరొకరు కలిపురుష ప్రభావం నుంచి తప్పుకోలేరు. కలిపురుషుని అనుగ్రహాన్ని సక్రమంగా వాడుకోవడం వచ్చినవాడు తరిస్తాడు. భగవద్భక్తి తత్పరుడై జీవితాన్ని గడుపుతుంటే కలిపురుషుడు అనుగ్రహిస్తాడు. త్రికరణ శుద్ధిగా చేసిన సత్సంకల్పములకు కార్యము చేసినట్లుగా ఫలితం వేస్తాడు మన ఖాతాలో. అది భక్తుడైనవాడికి అందే పరమ అదృష్టం. తుమ్మెద తేనె త్రాగినట్లు మానవుడు కలిపురుషుని అనుగ్రహాన్ని పొందగలిగితే అటువంటి మానవుడు ధన్యుడు. కనబడకూడనివి కనపడ్డాయనుకో..కలి పురుషుని ఉద్ధతి అనుకొని కళ్ళుమూసుకొని పరమేశ్వరునికి దణ్ణం పెట్టుకొని వెళ్ళిపో..అది నిన్నేం చేయదు ఇక. సత్సంకల్పం చేస్తే తరించిపోతావు.

బ్రహ్మ- హనుమంతుని స్తుతి ( 32 ఆంజనేయ నామాలు)


లంకిణిని హనుమంతుడు దెబ్బకొట్టడం మనకి తెలుసు. ఆ సంఘటన తర్వాత దేవతలు కుసుమవృష్టి కురిపించారు ఆంజనేయస్వామి వారిమీద. కుసుమ వృష్టి కురిపించగనే బ్రహ్మదేవుడు స్వయంగా దిగివచ్చాడట గగనం నుంచి. ఇది ఆశ్చర్యకరమైన అంశం. ఆయన స్వయంగా దిగి వచ్చి బ్రహ్మగారు హనుమంతుని స్తుతి చేస్తారు.ఆ స్తుతి చేసేటప్పుడు 32 ఆంజనేయ నామాలు అంటారాయన. ఇవి విశేషమైన అంశం. 32 హనుమన్నామాలు. ఈ 32 హనుమన్నామాలతో సాక్షాత్తు బ్రహ్మదేవుడు స్తుతించాడు. ఎందుకంటే హనుమంతుడు ఇప్పుడు కనపడుతున్న లీలారూపం వేరు. ఆయనలో ఉన్న మంత్రమూర్తులేమిటో వేదములు తెలిసిన బ్రహ్మ గారికి తెలుస్తుంది కానీ ఇంకెవరికి తెలుస్తుంది? అందుకు 32 నామములతో హనుమంతుని కీర్తన చేస్తారు. ఈ 32 నామాల వరుసని సుందర మంత్రము అంటారు. సుందర హనుమన్మంత్రము అంటే 32 నామాల వరుస. ఈ 32 నామాల శక్తి సుందరకాండలో వ్యాపించి ఉంది. ఇదీ రహస్యం. అందుకే సరిగ్గా లంకలో ప్రవేశించబోయే ముందు చేసిన స్తోత్రం బ్రహ్మగారిది. ఇది రహస్యం. సంహితా గ్రంథాలలో ఉంటుంది. ఎవరైతే ఈ నామాలు పఠిస్తారో వారికి అన్నిరకాల ఆధివ్యాధులు నశిస్తాయి. ఇందులో 27 ముఖ్యంగా తీసి చూపిస్తున్నారు. 

Lankini
హనుమానంజనా సూనుః వాయుపుత్రో మహాబలః
కపీంద్రః పింగళాక్షశ్చ లంకా ద్వీప భయంకరః
ప్రభంజన సుతః వీరః సీతాశోక వినాశకః
అక్షహంతా రామ సఖః రామకార్య దురంధరా
మహౌషధ గిరేర్హారీ వానర ప్రాణదాయకః
వాగీశ తారకశ్చైవ మైనాక గిరిభంజనః
నిరంజనో జితక్రోధః కదళీవన సంవృతః
ఊర్ధ్వ రేతా మహాసత్వః సర్వమంత్ర ప్రవర్తకః
మహాలింగ ప్రతిష్ఠాతా బాష్పకృత్ జపతాం వరః
శివధ్యానపరో నిత్యం శివపూజా పరాయణః!!

ఇవి మొత్తం ఇరవై ఏడు నామాలు. 27 నామాలు కలుపుకుంటే దీనికి సుందరహనుమన్మంత్రము అని పేరు. 5 రహస్య నామములుగా చెప్పారు. కనుక 27 ఇక్కడ ప్రస్తావన చేయడం జరుగుతోంది. కనీసం విని ఆనందించినా చాలు. గుర్తు పెట్టుకోలేకపోయినా.

జీవితం ఎప్పుడూ సాఫీగా సాగదు.


జీవితం ఎప్పుడూ సాఫీగా సాగదు. అలా నిరంతరం సుఖంగా ఉండాలని ఆశించడమూ పొరపాటే.

శాస్త్రాలలో ఈ లోకాన్నే ’మిశ్రలోకం’ అన్నారు. సుఖదుఃఖాల సమ్మేళనం ఈ లోకం. పాపపుణ్యాల మిశ్రమమిది.

అయితే సుఖదుఃఖాలు వస్తూపోతూ వున్నా, మన వ్యక్తిత్వాన్ని చెక్కు చెదరకుండా కాపాడుకోవడమే మన కర్తవ్యం.

ఎలాంటి వ్యక్తికైనా ప్రతికూల కాలమంటూ ఉంటుంది. ఒక వ్యక్తి ఒక విషయంలో నిరాటంకంగా అవరోధాల్ని అధిగమించి విజయం సాధిస్తే, అదే విషయంలో మరోవ్యక్తి విఫలుడౌతాడు. అప్పుడు విజయం పొందిన వాడిని చూసి నైరాశ్యానికి గురికానక్కరలేదు. తనకంటే వైఫల్యాలు ఎదుర్కొనే వారు కూడా చాలామంది ఉండవచ్చు.

దుఃఖం మనం కోరితే రాలేదు. అలాగే సుఖం కూడా మనం కోరకుండానే రావచ్చు. దుఃఖాలకి కృంగిపోయేవారు క్రమంగా ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి, ధర్మాన్నీ, దైవాన్నీ కూడా నిందిస్తారు. సుఖాలకి పొంగి గర్వించేవాడు కూడా బుద్ధి సమతుల్యాన్ని పోగొట్టుకొని, ధర్మాన్నీ, దైవాన్నీ విస్మరిస్తాడు. రెండూ వ్యక్తిత్వానికి ప్రమాదకారులే.

సుఖదుఃఖాల గురించి కాకుండా ధర్మబద్ధమైన కర్తవ్యంపైనే దృష్టిని నిలిపిన వారు ధన్యజీవుడౌతాడని మన శాస్త్రాలు ప్రబోధిస్తున్నాయి.
అనుభవాలు ఎలా ఉన్నా, ఆచరణలో మాత్రం మనం పొరపాటున సంయమనాన్ని కోల్పోరాదు.

శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేక సంరంభం నుంచి దైవవశాత్తూ తొలగినా, వనవాసాల పాలైనా తన ధర్మం నుంచి, ఆత్మస్థితి నుంచి చ్యుతుడు కాలేదు.
ఓటమిపాలై, సంపదలనీ, రాజ్యాన్నీ కోల్పోయినా, అడవులలో మ్రగ్గినా మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా, తపస్సుతో కాలం గడుపుతూ, సరైన సమయం వచ్చేవరకు సంయమనాన్ని పాటించిన యుధిష్ఠిరుని నిష్ఠను సైతం మనం గమనించాలి.

కాలం కలిసిరని స్థితిలో పదవీచ్యుతుడైన నలుడు – అతని భార్య దమయంతి తమ ధర్మమూలాలను వదలకుండా, చాలా సమన్వయాన్ని పాటిస్తూ తిరిగి సుస్థిరులయ్యారు.

సాఫల్య వైఫల్యాలు, భోగాలు, విషాదాలు …ఏవి ఎలా ఉన్నా, ధర్మాచరణ ఇచ్చే తృప్తి చాలా గొప్పది. నీతికి నిబద్ధమై జీవించేటప్పుడు చేదు అనుభవాలు తారసపడినా, ఆ ధర్మబద్ధతే ఎంతో తీయని తృప్తినిస్తుంది.

పవిత్రంగా, నిష్కపటంగా బ్రతకడంలో ఉన్న తృప్తి కోట్లకు పడగెత్తిన వారికి సైతం లభించడం కష్మే. ఊహించని విధంగా మలుపు తిరిగి వేదనాభరితమైన సంఘటనలు జరిగితే మనోనిబ్బరాన్ని కోల్పోవడం సహజమే. వెంటనే “దేవుళ్ళు కూడా నన్ను మోసగించారు. ధర్మంగా బ్రతికే రోజులు కావు” ఇలాంటి మాటలు దొర్లుతాయి.

కానీ ఆ సమయంలోనే ’నిబ్బరం’ అనే మాటను మరువరాదు. ధైర్యం, నిగ్రహం వంటి విషయాలు కాని కాలంలోనే అవసరమయ్యే అంశాలు. ఆ సమయంలో మనల్ని మనం నియంత్రించుకొని, మరింతగా ధర్మబద్ధతని పాటించాలి.

ఉత్తమ సంస్కారం కలవాడు ప్రతికూల పరిస్థితుల్ని కూడా పరీక్షా సమయాలుగా తీసుకొని, అధిగమించే అంతర్గత శక్తిని అభివృద్ధి పరచడానికి అదో అవకాశంగా భావిస్తాడు.

అసలు ప్రతికూలతల్లో కూడా అనుకూలతను వెదకి అనుకూలంగా మలచుకొనే యుక్తిని సాధించగలగాలి.

పాండవులు అడవులపాలైనా, ఆ ఏకాంత సమయాన్ని సాధనగా మలచుకున్నారు. ఎందరో మహాత్ములతో శాస్త్ర, ధర్మచర్చలు, తత్త్వచిమ్తన వంటి జ్ఞాన సముపార్జనతో కాలాన్ని సద్వినియోగం చేసుకున్నారు. రాజ్యాధికారం, పాలన లేని కాలాన్ని తపస్సమయంగా, విజ్ఞాన సంపాదనకు అనువైన ’తీరిక’గా భావించారు.

అర్జునుడు ఆ సమయంలోనే తపస్సునాచరిమ్చి రుద్ర ఇంద్రాది దేవతల అనుగ్రహాన్ని సంపాదించి, తద్వారా అస్త్ర విద్యల్ని సంపాదించుకున్నాడు. తన ధనుర్విద్యా కౌశలానిి మెరుగులు తీర్చాడు. ధర్మజుడు యజ్ఞయాగాదులతో, నిరంతర విచారనతో దైవబలాన్నీ, తత్త్వచింతననీ పెంపొందించుకున్నాడు.
శ్రీరాముడు వనవాస కాలంలో ఋషుల రక్షణ, దనుజుల శిక్షణ చేసి, సుగ్రీవాది వానరుల రాజ్యవ్యస్థను స్థిరపరచాడు. శబరి వంటి వారిని అనుగ్రహించాడు.

ఎంతటి కలిసిరాని కాలంలోనైనా బ్రతుకుకి పనికొచ్చే అంశాలుంటాయి. వాటిని గమనించి పురోగమించిన వాడే మహాపురుషుడు.

సార్వభౌమత్వం చేజారి, రాజ్యం అన్యాక్రాంతమై, భార్య దూరమై అవమాన భారంతో ఉన్న నలుడు అంతటి దుర్భర పరిస్థితుల్లో కూడా తన ధర్మబుద్ధిని విడనాడకుండా తనకున్న పాకకౌశలాన్నీ, సారథ్య నైపుణ్యాన్ని ప్రదర్శించి సానుకూల పరిస్థితుల దిశగా ప్రయాణించాడు.

మనం కోల్పోయినవి ఏమిటో ఆలోచించకుండా, మనకు మిగిలిన ఉపయోగకర అంశాలేమిటో పరిశీలించి, వాటిద్వారా పైకి ఎదగగలగాలి. ఈ మానసి స్థైర్యానికి ఆలంబనగా నిలిచే అంశాలు.

౧. ధార్మిక ప్రవర్తన ౨. భగవద్విశ్వాసం

దుఃఖేష్వనుద్విగ్నమనః సుఖేషు విగతస్పృహః!
వీతరాగ భయక్రోధః స్థితధీరుమునిరుచ్యతే!!
దుఃఖాలలో ఉద్విగ్నుడు (దిగులు పడేవాడు) కానివాడు, సుఖాలకు చలించని వాడు, రాగం భయం క్రోధం లేని వాడు – స్థితప్రజ్ఞుడు” అని గీతాచార్యుని మాట.

” ఆ స్థిత ప్రజ్ఞత ఎవరో యోగులకే తప్ప మనకెక్కడ సాధ్యమౌతుంది?” అని మాట్లాడడం కూడా సరికాదు.ఆ యోగులు కూడా సాధన ద్వారానే ఆ స్థితికి చేరుకున్నారు. సార్థకమైన జీవితానికి స్థితప్రజ్ఞత అవసరం.”ధీరుడు బంతివలె నేలమీద పడినా పైకి ఎగరగలదు. మూర్ఖుడు మట్టిముద్దవలె, పడినచోటే చతికిలబడతాడు” అన్న సుభాషితకారుని వచనాన్ని కూడా మనం స్ఫూర్తిగా తీసుకోగలగాలి