మహాభారతం పంచమ వేదము గా పరిగణించబడే భారత ఇతిహాసము. ఈ మహాకావ్యాన్ని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడు. 18 పర్వములతో, లక్ష శ్లోకములతో (74,000 పద్యములతో లేక సుమారు 18 లక్షల పదములతో) ప్రపంచము లోని అతి పెద్ద పద్య కావ్యములలో ఒకటిగా అలరారుచున్నది. సంస్కృతములో ఉన్న ఈ మహా కావ్యాన్ని, కవిత్రయము గా పేరు పొందిన నన్నయ, తిక్కన, ఎర్రన (ఎఱ్ఱాప్రగడ)లు తెలుగు లోకి అనువదించారు.
“యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్క్వచిత్”
– “ఇందులో ఏది ఉందో అదే ఎక్కడైనా ఉంది. ఇందులో లేనిది మరెక్కడా లేదు” అని ప్రశస్తి పొందింది. హిందువులకు ఎంతో పవిత్ర గ్రంథాలైన భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రము కూడా మహాభారతంలోని భాగాలే. దీనిని బట్టి ఈ కావ్య విశిష్టతను అంచనా వేయవచ్చును.
ఈ కావ్యవైభవాన్ని నన్నయ:
“ దీనిని ధర్మ తత్త్వజ్ఞులు ధర్మశాస్త్రమనీ, ఆధ్యాత్మవిదులు వేదాంతమనీ, నీతి విచక్షణులు నీతి శాస్త్రమనీ, కవులు మహాకావ్యమనీ అంటారు. లాక్షణికులు సర్వ లక్షణ సంగ్రహమనీ, ఐతిహాసికులు ఇతిహాసమనీ, పౌరాణికులు బహుపురాణ సముచ్ఛయమనీ కొనియాడుతారు. వివిధ తత్త్వవేది, విష్ణు సన్నిభుడు అయిన వేదవ్యాసుడు దీనిని విశ్వజనీనమయ్యేలా సృజించాడు. ”
మహాభారత గాథను వ్యాసుడు ప్రప్రథమంగా తన శిష్యుడైన వైశంపాయనుడి చేత సర్పయాగం చేయించేటపుడు జనమేజయ మహారాజుకి చెప్పించగా, అదే కావ్యాన్ని తరువాత నైమిశారణ్యంలో శౌనక మహర్షి సత్రయాగము చేయుచున్నప్పుడు సూతమహర్షి అక్కడకు వచ్చిన ఋషులకు చెప్పాడు.
మహాభారతాన్ని చెరకుగడతో పోల్చారు. పర్వము అంటే చెరకు కణుపు. 18 కణుపులు (పర్వములు) కలిగిన పెద్ద చెరకుగడ, మహాభారతం. చెరకును నములుతున్న కొద్దీ రసం నోటిలోకి వచ్చి, నోరు తీపి ఎక్కుతుంది. అలాగే భారతాన్ని చదివిన కొద్దీ జ్ఞానం పెరుగుతుంది.
మహాభారత రచన చేసినది పరాశర మహర్షి కుమారుడయిన వేదవ్యాసుడు.మహాభారతకథను వ్యాసుడు రచన చేసిన సమయం మూడు సంవత్సరాలు .
మహాభారతకథను చెప్పడానికి స్వర్గలోకంలో నారద మహర్షిని, పితృలోకములో చెప్పడానికి దేవల మహర్షిని, గరుడ గంధర్వ లోకాలలో చెప్పడానికి శుక మహర్షిని, సర్పలోకంలో చెప్పడానికి సుమంతుడిలని, మానవలోకంలో చెప్పడానికి వైశంపాయన మహర్షిని నియమించాడు.
అంతకు పూర్వం దేవాసురయుధ్దంలా కురుక్షేత్రంలో మహాభారత యుద్ధం జరిగింది.
ఈ యుద్ధంలో భీష్ముడు 10 రోజులు, ద్రోణుడు 5 రోజులు, కర్ణుడు 2 రోజులు , శల్యుడు అర్ధరోజు సైన్యాధ్యక్షత వహించారు. మిగిలిన సగం రోజు భీముడు ధుర్యోధనుడితో యుద్ధం చేసాడు.
ఈ యుద్ధంలో పోరాడి మరణించిన వారి సంఖ్య 18 అక్షౌహిణులు. వీరిలో కౌరవ పక్షం వహించి పోరాడిన వారి సంఖ్య 11 అక్షౌహిణులు. పాండవ పక్షం వహిండి పోరాడిన వారి సంఖ్య 7అక్షౌహిణులు.
ఈ యుద్ధం జరిగిన ప్రదేశం శమంతక పంచకం. తన తండ్రిని అధర్మంగా చంపిన క్షత్రియ వంశాల మీద పరశురాముడు 21 పర్యాయములు భూమండలం అంతా తిరిగి దండయాత్ర చేసి క్షత్రియ వధ చేసిన సమయంలో క్షత్రియ రక్తంతో ఏర్పడ్డ ఐదు తటాకాలే ఈ శమంతక పంచకం. పరశురాముడు తన తండ్రికి ఇక్కడ తర్పణం వదిలి క్షత్రియుల మీద తనకు ఉన్న పగ తీర్చుకున్నాడు.
పంచమ వేదంగా వర్ణించబడే ఈ మహాభారతాన్ని కవులు మహాకావ్యమని, లాక్షణికులు సర్వలక్షణాలు కలిగిన గ్రంధరాజమని, పౌరాణికులు అష్టాదశపురాణ సారమని, నీతిశాస్త్రపారంగతులు నీతి శాస్త్రమని, తత్వజ్ఞులు ధర్మశాస్త్రమని, ఇతిహాసకులు ఇతిహాసమని ప్రశంసించారు.
వినాయకుని ఆదేశానుసారం వేదవ్యాసుడు ఆగకుండా చెప్తుంటే నినాయకుడు తన దంతమును విరిచి ఘంటముగా చేసికొని మహాభారతకథను లిఖించాడు.
మహాభారతంలోని పర్వాలు 100. పైష్యమ, ఆస్తీకము, ఆదివంశావతారం, సంభవపర్వము, జతుగృహదాహము, హైడంబము, బకవధ, చైత్రరధము, ద్రౌపదీస్వయంవరం, వైవాహికం, విదురాగమనము, రాజ్యార్ధలాభము, అర్జునతీర్ధయాత్ర, సుభద్రాకల్యాణం, హరణహారిక, ఖాండవదహనం, మయదర్శనం,సభాపర్వము, మంత్రపర్వము, జరాసంధవధ, దిగ్విజయము, రాజసూయము, బర్ఘ్యాభిహరణం, శిశుపాలవధ, ద్యూతము, అనుద్యూతము, అరణ్యము, కిమ్మీరవధ, కైరాతము, ఇంద్రలోకాభిగమనం, ధర్మజతీర్ధయాత్ర, జటాసురవధ, యక్షయుద్ధం, అజగరం, మార్కడేయోపాఖ్యానం, సత్యాద్రౌపదీ సంవాదం, ఘోషయాత్ర, ప్రాయోపవేశం, వ్రీహి ద్రోణాఖ్యానం, ద్రౌపదీహరణం, కుండలాహరణం, ఆరణేయం, వైరాటం, కీచకవధ, గాగ్రహణం, అభిమన్యువివాహం, ఉద్యోగం, సంజయయానం, ధృతరాష్ట్రప్రజాగరణం, సానత్సుతజాతం, యానసంధి, భగవద్యానం, సైనానిర్యాత, ఉలూకదూతాభిగమనం, సమరధ, అతిరధ సంఖ్యానము, కర్ణభీష్మవివాదం, అబోపాఖ్యానం, జంబూఖండవినిర్మాణం, భూమిపర్వము, భీష్మాభిషేకం, భగవద్గీత, భీష్మవధ, ద్రౌణాభిషేకం, సంశప్తకవధ, అభిమన్యువధ, ప్రతిజ్ఞాపర్వం, జయద్రధవధ, ఘటోత్కచవధ, ద్రోణవధ, నారాయణాస్రప్రయోగం, కర్ణపర్వం, శల్యపర్వం, హ్రదప్రవేశం, గదాయుద్ధం, సారసత్వం, సౌప్తిక పర్వం, వైషీకం, జలప్రదానం, స్త్రీపర్వం, శ్రాద్ధపర్వం, రాజ్యాభిషేకం, చార్వాక నిగ్రహం, గృహప్రనిభాగం, శాంతిపర్వం, రాజధర్మానుకీర్తనం, ఆపద్ధర్మం, మోక్షధర్మం, ఆనుశాసనికం, భీష్మస్వర్గారోహణం, అశ్వమేధం, అనుగీత, ఆశ్రమవాసం, పుత్రసందర్శనం, నారదాగమనం, మౌసలం, మహాప్రస్థానం, హరివంశం, భనిష్యత్పర్వం.