పంచ కేదారాలు


కురుక్షేత్ర యుద్ధం ముగుసిసిన తరువాత పాoడవులు బ్రహ్మహత్యా పాతకం, దాయాదులను చంపిన పాపం పోగొట్టు కోవడానికి శివ దర్శననానికి వెళ్ళారు వారికి దర్శనం ఇవ్వడానికి ఇషట పడని ఈశ్వరుడు కాశీ విడిచి నంది రూపం ధరించి ఉత్తర దిశగా పయన మయ్యాడు. పాండవులు పట్టు వదలక వెంబడించగా గుప్త కాశీ ప్రాంతంలో నంది రూపంలో కనిపించిన ఈశ్వరుని పట్టుకోవడానికి భీమశేనుడు ప్రయత్నించగా ఈశ్వరుడు మాయమయ్యాడు. అప్పుడు ఈశ్వరుని శరీర భాగాలు ఐదు ఛోట్ల ప్రతిష్టితమై అవి పుణ్య క్షేత్రాలుగా భాసిల్లాయి. శివ పురాణం లో వర్ణించబడిన పంచ కేదారాలను పంచఆరామాలని పిలుస్తుంటారు. అవి వరసగా కేదారినాధ్, తుంగ నాధ్, రుద్ర నాధ్, మధ్య మహేశ్వర్, కల్పేశ్వర్. నేపాల్ లోని ఘోరక్ నాధ్ తెగ వారు పంచకేదార యాత్రకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. భారతీయులూ ఈ యాత్రకు ప్రాధాన్యత ఇస్తారు. ఖాట్మండు లోని పశుపతి నాధ్ ఆలయ నిర్మాణానికి ఈ పొంచ కేదారాల నిర్మాణానికి పోలికలు ఉంటాయి.

pancha

 

కేదారినాధ్
ద్వాదశ జ్యీతిర్లింగాలలో ప్రసిద్ధి చెందింది పంచ కేదారాలలో మొదటిది కేదారనాధ్. పాండవులకు అందకుండా పారి పోయిన శివుని మూపురభాగం ఉన్న చోటు. ఇందుకు నిదర్శనంగా ఇక్కడి లింగం ఎనిమిది గజముల పొడవు, నాలుగు గజముల ఎత్తు, నాలుగు గజముల వెడల్పు ఉంటుంది. ఈక్కడి లింగం త్రిభుజాకారంలో ఉంటుంది. పాండవులు తమ అంతిమ దశలో స్వర్గారోహణ ఇక్కడ నుండి ప్రారంభించారు. శంకరాచార్యులు మోక్షం పొందిన క్షేత్రం ఇదే. సంవత్సరానికి ఆరు నెలలు మాత్రమే తెరచి ఉంచే ఈ ఆలయం ప్రతి సంవత్సరం అక్షయత్రుతియ నాడు తెరుస్తారు. కాత్రిక మాసంలో వచ్చే యమద్వివిదియ నాడు మూసి వేస్తారు. ఈ మధ్య కాలంలో స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని యూకీ మఠానికి తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు. హృషీ కేశ్ వరకు రైలు మార్గం ఉంటుంది. అక్కడి నుండి దాదాపు 250 కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గంలో ప్రయాణించి గౌరీ కుండ్ చేరుకుని అక్కడి నుండి శిఖరానికి 14 మైళ్ళ దూరం కాలి నడకన చేరాలి. కానీ భక్తులు అనేక మంది డోలీలు, గుర్రాలపై ప్రయాణించి ఆలయం చేరుకుంటారు.

తుంగనాధ్
పంచ కేదారాలలో రెండవది తుంగనాధ్. శివుని చేతులు లింగ రూపంలో వెలసిన క్షేత్రం ఇది. కేదారానికంటే ఎత్తైన ప్రదేశం. తుంగనాధుడంటే శిఖరాలకు అధిపతి అని అర్ధం. ఈ ఆలయంలోని లింగం ఒక అడుగు ఎత్తున చేతులను పోలి ఉంటుంది. స్వల్పంగా ఎడమ వైపు వాలి ఉంటుంది. గర్భగుడిలో శివునితో వ్యాస, గణపతి అష్టధాతు విగ్రహాలు ఉంటాయి. ప్రమధ గణాల విగ్రహాలు ఉంటాయి. పాండవుల చిత్రాలు గోడలో చెక్కి ఉంటాయి. ఆలయానికి కుడి వైపున పార్వతీ దేవి ఆలయం ఉంటుంది. వేరొక వైపున ఐదు ఆలయాలు ఉంటాయి . అవి పంచకేదారెఆల నమూనాలు. ఈ ఆలయాన్ని అర్జునుడు నిర్మించారని స్థల పురాణం చెప్తుంది. శీతా కాలంలో ఉత్సవ విగ్రహాలను ముకునాధ్ మఠానికి తరలించి పూజలు నిర్వహిస్తారు.

రుద్రనాధ్
పంచ కేదారాలలో మూడవది రుద్రనాధ్. నంది రూపంలో ఉన్న శివుని ముఖ భాగం వెలసిన చోటు ఇదే. అరమోడ్పు కన్నులతో భువనమోహనంగా ముఖ లింగ రూపంలో ఉండే స్వామిని నీలకంఠ్ మహాదేవ్ అని భక్తులు పిలుస్తారు. తెల్ల వారు ఝామున అభిషేక వేళలో స్వామి వెండి తొడుగు తొలగిస్తారు. నిజరూప దర్శననానికి భక్తులు ప్రాధాన్యత ఇస్తారు. ఈ ఆలయానికి వెనుక భాగంలో వైతరణీ నది ప్రవహిస్తుంటుంది. ఇక్కడకు వచ్చే భక్తులు తమ పూర్వీకులకు మోక్షం ప్రసాదించమని వేడుకుంటారు. ఈ ఆలయానికి సమీప గ్రామం గోపేశ్వర్.గోపేశ్వర్ నుండి 24 మైళ్ళు క్లిష్టమైన కొండ దారిలో కాలి నడకన ప్రయాణించి ఆలయానికి చేరాలి కనుక పంచ కేదారాలలో ఇది చాలా కష్ట తరమైనది గా భావిస్తారు. శీతాకాలంలో ఇక్కడి విగ్రహాలను గోపేశ్వర్కు తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు.

మధ్య మహేశ్వర్
పంచ కేదారాలలో నాలుగవది మధ్య మహేశ్వర్. విశ్వనాధుని నాభి భాగం లింగంగా వెలసిన క్షేత్రం. నంది రూపంలూ ఉన్న ఈశ్వరుని భీమసేనుడు పట్టుకున్న గుప్త కాశీకి 24 మైళ్ళ దూరంలో ఉంటుంది. ఈ ఆలయానికి ఎడమ వైపున రెండు చిన్న ఆలయాలు ఉన్నాయి ఒకటి పార్వతీ దేవిది, ఒకటి అర్ధ నారీశ్వరునిది. ఈ మూడు ఆలయాలను భీమసేనుడు నిర్మించాడని చెప్తారు. ఆలయానికి కుడి వైపున చలువరాతితో నిర్మించిన సరస్వతీ దేవి ఆలయం ఉంటుంది. శీతా కాలంలో ఇక్కడి విగ్రహాలను యూకీ మఠానికి తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు.

కల్పనాధ్
పంచ కేదారాలలో చివరిది కల్పనాధ్. హృషీకేశ్ బద్రీనాధ్ రోడ్డు మార్గంలో 12 కిలోమీటర్లు ప్రయాణించి ఈ ఆలయం చేరుకోవచ్చు. శివుని ఝటాఝూటం ఇక్కడ లింగ రూపంలో వెలసిందని స్థల పురాణం చెప్తుంది. ఈ ఆలయంలో సంవత్సరమంతా పూజలు నిర్వహిస్తారు. కోడలపై దట్టమైన అడవుల మధ్య చిన్న గుహలో వెలసిన ఈ స్వామిని ఝటేశ్వర్ అని భక్తులు పిలుస్తారు. అత్రి, అనసూయల పుత్రుడైన దుర్వాస మహర్షి ఈ ఆలయప్రాంగణంలో ఉన్న కల్ప వృక్షం కింద తపస్సు చేసి శివుని నుండి అనేక వరాలు పొందాడని ప్రతీత.

సుబ్రహ్మణ్య వ్రతకల్పన.. సంతాన ప్రదాతకం


సుబ్రహ్మణ్యేశ్వరుడు కారణజన్ముడు. తారకాసుర సంహారంకోసం జన్మించినవాడు. దేవగణానికి సర్వసేనాధిపతిగా పురాణాలు చెబుతున్న ఆ స్వామి సర్వశక్తిమంతుడు. ఆది దంపతులైన శివపార్వతులకు ముద్దుల తనయుడు. హిరణ్యకశ్యపుని కుమారుడు ‘నీముచి’. ‘నీముచి’ కొడుకు తారకాసురుడు. తారకాసురుడు రాక్షసుడు. అతడు పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సుచేసి ఆయన ఆత్మ లింగాన్ని వరంగా పొందుతాడు. అంతేకాకుండా ఒక బాలుడి చేతిలో తప్ప ఇతరులెవ్వరివల్ల తనకు మరణం లేకుండా వరం పొందుతాడు. తారకుడి బాధలు పడలేక దేవతలు తమకొక శక్తిమంతుడైన బాలుడ్ని ప్రసాదించమని శివుడ్ని వేడుకున్నారట. శివుడు వారి కోరికమేరకు కుమారస్వామి జన్మించాడు. కుమారస్వామి దేవతలకు సేనానిగా నిలిచి తారకుడ్ని సంహరించాడు. అందువల్ల తారకుడి సంహారంకోసం జన్మించినవాడు కుమారస్వామి. అతనికి సుబ్రహ్మణ్యేశ్వరుడు అనే పేరుకూడా వుంది. సర్పరూపుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజునకు అధిష్టాన దైవం. రాహువునకు సుబ్రహ్మణ్యస్వామి, సర్పమంత్రాలు అధిష్టాన దైవాలు. కొందరు కేతు దోష పరిహారానికి కూడా సుబ్రహ్మణ్యస్వామి, సర్ప పూజలు చేయాలంటారు. సర్వశక్తిమంతుడైన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కరుణామయుడు. దయాహృదయుడు పిలిచిన వెంటనే పలికే దైవం. మానవుని దైనందిన జీవితంలో కుజునికి అత్యంత ప్రాధాన్యం ఉంది. కుజుడు మనిషికి శక్తి, ధనాన్ని ధైర్యాన్నిస్తాడు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనచేస్తే అవన్నీ మానవులకు సమకూరుతాయి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపుడు కావడంవల్ల, సర్పగ్రహాలైన రాహుకేతువులు సుబ్రహ్మణ్య ఆధీనంలో ఉంటారని జ్యోతిష్య గ్రంథాలు చెబుతున్నాయి. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనం, సుబ్రహ్మణ్య పూజ సర్వ శుభాలనిచ్చి, రాహుకేతు దోషాలకు కూడా పరిహారంగా భావించబడుతోంది. మంగళవారం, శుద్ధ షష్టి, మృగశిర, చిత్త, ధనిష్ట ఏ నక్షత్రం కలిసిన రోజైనా కుజునికి, సుబ్రహ్మణ్యేశ్వరునికి ప్రీతికరం. ఆరోజున సుబ్రహ్మణ్య మంత్రం, కుజమంత్రం జపించాలి. అనంతరం సుబ్రహ్మణ్య కుజులకు అష్టోత్తర, శత నామావళితో పూజచేయాలి. ఇలా తొమ్మిది రోజులు జపమూ, పూజ చేసి చంద్ర లేదా మోదుగ పుల్లలతో నెయ్యి తేనెలతో తొమ్మిది మార్లకు తగ్గకుండా హోమం చేసి దాని ఫలితాన్ని పగడానికి ధారపోసి ఆ పగడాన్ని ధరిస్తే మంచిదని చెబుతారు. దీనివల్ల కుజ గ్రహ దోష పరిహారం జరిగి సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహం కూడా కలుగుతుందంటారు. ఈ పూజా అనంతరం సర్ప సూక్తం లేదా సర్పమంత్రాలు చదవడంవల్ల ఇంకా మేలు జరుగుతుంది.
కాలసర్పదోషం ఉన్నవారికి మేలైనవి:
జాతకంలో కాలసర్పదోషం ఉన్నవారు, కేతు దోషం ఉన్నవారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం అన్నివిధాల శ్రేయస్కరం. ఆ స్వామి జపం సర్వవిధాలా మేలు చేస్తుంది. అలాగే రాహు మంత్రం, సుబ్రహ్మణ్య మంత్రం సంపుటి చేసి జపించి సర్పమంత్రాలు చదువుతూ, పగడాన్ని ధరిస్తే మేలు జరుగుతుంది. ఈ పూజలవల్ల రాహుగ్రహం అనుగ్రహమూ కలుగుతుంది. అలాగే సంతాన ప్రాప్తికోసం మహిళలు ఎక్కువగా ఆరాధించే దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు బాలుడి రూపంలో దర్శనమిస్తాడు కాబట్టి, తన రూపంతో బిడ్డలను ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు. అందుకనే సుబ్రహ్మణ్య ఆలయాలలో సంతానం లేని స్ర్తిలు పూజలుచేయడం తరచుగా మనం చూస్తూ వుంటాం. సంతానప్రాప్తిని కోరే స్ర్తిలు వెండి సర్పానికి సుబ్రహ్మణ్య, కేతు మంత్రాలతో 21మార్లు పాలతో అభిషేకించి ఆ పాలను సేవిస్తే సత్ సంతానం కలుగుతుందని మహిళా భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే ఏదైనా పుట్టకు నమస్కరించి పుట్ట చుట్టు 21 లేదా 108మార్లు మండలం పాటు (40రోజులు) ప్రదక్షిణలు చేస్తే సంతానం కలుగుతుందని అంటారు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనం సర్వ క్లేశాలను దూరంచేసి, సర్వశక్తుల్ని ఇస్తుందని అంటారు.

నవగ్రహప్రదక్షిణలు


శివాలయాల్లో నవగ్రహాలుకు ప్రత్యేకమైన సన్నిధి వుంటుంది. మూలవిరాట్టును దర్శించుకుని బయటికి వచ్చాక నవగ్రహాలను దర్శించుకోవాలి.

ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ:’‘ అంటూ తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి.

  1. మొదటి ప్రదక్షిణలో… జపాకుసుమాల వర్ణం గలవాడా, కాశ్యపగోత్రుడా, నవగ్రహమండలనాయకుడా, శ్రీసూర్యభగవానుడా, సదా శుభాన్ని అనుగ్రహింతువు గాక!
  2. రెండో ప్రదక్షిణలో కటకరాశికి అధిపతి అయిన ఓ చంద్రుడా, పెరుగు, శంఖాల వంటి ధవళవర్ణం గలవాడా, ఆత్రేయగోత్రోద్భవుడా, శ్రీచంద్రభఘవానుడా, మమ్మల్ని కరుణించు!
  3. మూడో ప్రదక్షిణలో బంగారు రంగుతో మెరిసిపోయేవాడా, వృశ్చికమేషరాసులకు అధిపతి అయినవాడా, భరద్వాజగోత్రుడా, శ్రీ అంగారకుడా మాకు మంగళాలను ప్రసాదించు!
  4. నాలుగో ప్రదక్షిణలో నల్లని వర్ణం గలవాడా, కన్యామిథునరాసులకు అధిపతి అయినవాడా, ఉత్తరదిశలో బాణరూపమండలంలో వసించేవాడా, శ్రీబుధరాజా మాకు మేలు కలిగింతువు గాక!
  5. ఐదో ప్రదక్షిణలో అంగీరసగోత్రుడా, ధనుస్సు, మీనరాసులకు అధిపుడా, దేవగురువైన బృహస్పతీ, శ్రీగురుభగవానుడా, మాపై కరుణను వర్షించు!
  6. ఆరో ప్రదక్షిణలో భార్గవగోత్రం గలవాడా, దైత్యగురువైన శుక్రాచార్యుడా, స్త్రీభోగాలను ప్రసాదించేవాడా, మా పైన కరుణావృష్టిని కురిపించు!
  7. ఏడో ప్రదక్షిణలో కాశ్యపగోత్రుడూ, కుంభమృగశీర్షాలకు అధిపతి అయినవాడూ, దీర్ఘాయువును ప్రసాదించేవాడూ అయిన శ్రీశనైశ్చరుడా, మాకు మంగళాలు కలిగేలా చూడు!
  8. ఎనిమిదో ప్రదక్షిణలో సింహికాగర్భసంభూతుడా, దక్షిణాన దక్షిణముఖంగా నక్షత్రమండలంలో వుండేవాడా, శ్రీరాహుభగవానుడా మాకు సదా మంగళాలు కలిగిచు!
  9. తొమ్మిదో ప్రదక్షిణలో జైమినిగోత్రికుడా, గంగాయాత్రను సంప్రాప్తింపజేసేవాడా, రౌద్రస్వరూపంతో వుంటూ, రుద్రాత్మకుడుగా పేరు పడినవాడా, శ్రీకేతుభగవానుడా మాకు మేలు కలుగజేయి!అంటూ ప్రార్థించుకుంటూ ప్రదక్షిణలు చేయాలి.

ఉండ్రాళ్ల తద్ది


నోము కథ
పూర్వం ఒకరాజుకు ఏడుగురు భార్యలు వున్నప్పటికీ.. అతను ‘‘చిత్రాంగి’’ అనే వేశ్యపై ఎక్కువగా మక్కువ కలిగి వుండేవాడు. ఆమెతోనే సమయాన్ని గడిపేవాడు.

ఒకనాడు భాద్రపద బహుళ తదియనాడు రాజుగారి ఏడుగురు భార్యలు ‘‘ఉండ్రాళ్లతద్ది’’ అనే నోమును నిర్వహించుకుంటున్నారని చెలికెత్తెల ద్వారా చిత్రాంగి వింటుంది. అప్పుడు ఆ చిత్రాంగి, రాజుతో.. ‘‘నువ్వు వివాహం చేసుకున్న నీ భార్యలతో ఉండ్రాళ్ల తద్దీ నోము చేయించుకున్నావు. నేను ఒక వేశ్య అవడంవల్ల నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు. నీ భార్యలమీద వున్న ప్రేమ నా మీద కూడా వుంటే.. ఉండ్రాళ్ల తద్దీ నోమును అవసరమైన సరుకులను నాకోసం ఏర్పాటు చేయ’’మని అడిగింది.

ఆమె ప్రతిజ్ఞను రాజు అంగీకరించి.. నోముకు కావలసిన పదార్థాలను, సరుకులను ఆమెకోసం ఏర్పాటు చేస్తాడు. అవి అందగానే వేశ్య అయిన చిత్రాంగి.. భాద్రపత తృతీయనాడు సూర్యోదయానికి ముందే లేచి అభ్యంగన స్నానాన్ని ఆచరిస్తుంది. సూర్యాస్తమయం వరకు ఏమీ తినకుడా ఉపవాసం వుంటుంది.

చీకటి పడగానే గౌరీదేవికి బియ్యపు పిండితో తయారుచేసుకున్న ఉండ్రాళ్లను చేసి, నైవేద్యం పెట్టింది. అయిదు ఉండ్రాళ్లను ఒక పుణ్యస్త్రీకి వాయనమిచ్చింది. నోము ఆచరించి గౌరీదేవి అనుగ్రహాన్ని పొందడంత.. ఐదేళ్లు నిర్వఘ్నంగా నోము నోచుకుంటుంది. దాని ఫలితంగా ఆమె పవిత్రంగా, సద్గతిని పొందుతుంది.

విధానం :
భాద్రపద తృతీయనాడు స్త్రీలు ఉదయాన్నే లేచి ముందుగా అభ్యంగన స్నానం ఆచరించాలి. సాయంత్రవరకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోకుండా ఉపవాసం వుండాలి. బియ్యపు పిండితో తయారుచేసిన ఉండ్రాళ్లను చేసి, వాటిని వండుకోవాలి. గౌరిదేవిని పూజామందిరంలో ప్రతిష్టించుకున్న తరువాత పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి.

తరువాత ఐదు ఉండ్రాళ్లను గౌరిదేవికీ, మరో ఐదు ఉండ్రాళ్లను ఐదుగురు ముత్తైదువులకు వాయనమివ్వాలి. ఇలా ఐదు సంవత్సాలవరకు ఈ నోమును ఆచరించిన తరువాత వచ్చిన వారందరి పాదాలకు పసుపు-పారాణి రాసి, వారి ఆశీస్సులను పొందాలి. పెళ్లికాని అమ్మాయిలు ఈ నోమును నోచుకుంటే మంచి భర్త లభిస్తాడు.

ఇతర విశేషాలు :
భాద్రపద బహుళ తదియరోజు స్త్రీలు సద్గతులు పొండానికి నిమిత్తం ఉండ్రాళ్ల తద్ది నోమును ప్రత్యేకంగా ఆచరించి, నిర్వహించుకుంటారు. ఈ నోమును ‘‘మోదక తృతీయ’’ అనే మరో పేరు కూడా వుంది. ఉండ్రాళ్ల నివేదన కలిగిన నోము కావడంతో.. ‘‘తద్ది’’ అనేమాట మూడవరోజు ‘‘తదియ’’ అనే అర్థంతో ఉపయోగించబడింది. దీంతో ఇది ఉండ్రాళ్ల తద్దిగా పిలువబడుతుంది.

భాద్రపదంలో పూర్ణిమ వెళ్లిన మూడోరోజున బహుళ తదియనాడు ఈ నోమును నోచుకోవాలని పూర్వీకులు నిర్ణయించారు. అంతేకాదు.. సాక్షాత్తు శివుడే స్వయంగా పార్వతీదేవికి ఈ నోము గురించి వివరించాడని ఐతహ్యం.

 

===============================================================================

మన తెలుగింటి ఆడపిల్లలు అందానికి ప్రతీకలు. ఒకొక్క వయసులో ఒకో రకం గా మనల్ని మురిపిస్తారు. చిన్న పిల్లలప్పుడు బుట్ట చేతుల గౌన్లు వేసుకుని ముద్దుగా ఉంటారు. ఇంకొంచెం వయసు వస్తే పట్టు లంగాలు జాకెట్లు వేసుకుని, పొడుగు జడలు వేసుకుని ఏంతో ముచ్చ్హటగా ఉంటారు. ఇలా ఒకొక్క ఏడాది వయసు పెరిగే కొద్ది వాళ్ళ అందచందాలతోనే కాకుండా ముద్దు మురిపాలతో, ఆట పాటలతో ఏంతో సందడిగా ఉంటారు. వారి ప్రత్యేకమైన ఆటలు –తొక్కుడు బిళ్ళ, అష్టా చెమ్మా, చెమ్మ చెక్క లాంటి ఆటలు ఊరి వారనందరిని ఎంతో ఆకట్టుకునేవి. కానీ ఈ ఆధునిక యుగం లో చిన్నప్పటి నుండే పోటి చదువులు మూడో తరగతి నుండే ఐ ఐ టి ఫౌన్డేషన్ కోర్స్ పరీక్షల ఒత్తిడి, రేంక్ లకై తల్లిదండ్రుల పరుగులాటలలో పడి మనం కూడా ఆడపిల్లల అచ్చట ముచ్చట మర్చిపోయి, చదువు సంధ్యలకు మాత్రమే ప్రాముఖ్యతనివ్వడం మొదలు పెట్టాము. ఫలితంగా ఆడపిల్లల ప్రత్యేక పండగలైన ‘ఉండ్రాళ్ళ తద్ది’, ‘అట్ల తద్ది’ పండగలు పూర్తిగా మరుగున పడుతున్నాయి. ఈ ఉండ్రాళ్ళ తద్ది, అట్ల తద్ది ఆడపిల్లల పండగలు. ఈ పండగలను ఊరులోని ఆడపిల్లలంతా కలిసి కోలాహలంగా జరుపుకుంటారు. రంగు రంగుల దుస్తులు ధరించి, ఉండ్రాళ్ళ తద్ది, అట్ల తద్ది నోములు నోచుకునేటప్పుడు కన్నుల పండుగ గా అగుపిస్తారు.

ఉండ్రాళ్ళ తద్ది భాద్రపద మాసంలో బహుళ తదియ నాడు అనగా సెప్టెంబర్ నెల 11 తారీఖున వస్తుంది. సరిగ్గా ఒక మాసం తర్వాత అనగా ఆశ్వీయజ మాస బహుళ తదియ నాడు అనగా విజయదశమి తర్వాత వచ్చే తదియ నాడు అంటే అక్టోబర్ 11 న అట్ల తద్ది జరుపుకుంటారు. ఈ రెండు పండగలను ఎందుకు కలిపి ప్రస్తావిస్తున్నానంటే ఈ రెండు పండగలు జరుపుకునే విధానం, ప్రాశస్త్యము ఒకటే కావడమే కాకుండా ఉండ్రాళ్ళ తద్ది అట్ల తద్ది కి శిక్షణ గా కూడా భావించబడేది. ప్రస్తుతం ముందుగా వచ్చే ఉండ్రాళ్ళ తద్ది గురించి మాట్లాడుకుని తర్వాత అట్ల తద్ది సమయం లో అట్ల తద్ది గురించి ప్రస్తావించు కుందాము.

ఉండ్రాళ్ళ తద్ది రెండు రోజుల పండగ. ఈ పండగను అయిదు సంవత్సరాల నుండి పదిహేను సంవత్సరాల లోపు ఆడపిల్లలు జరుపుకుంటారు. అది ఆడపిల్లలు మానసికంగాను, శారీరకం గాను ఎదిగే వయసు. మొదటి రోజు అంటే తదియకు ముందురోజు అనగా విదియనాడు ఆడపిల్లలు తెల్ల వారుజామునే లేచి తలారా స్నానం చేసి, మూడు, అయిదు లేక తొమ్మిది మంది ముత్తైదువులకు కుంకుడు కాయలు, సున్నిపిండి, పసుపు కుంకుమ, గోరింటాకు ముద్ద వాయనం ఇస్తారు. ఇది సూర్యోదయానికి ముందే జరగాలి. తర్వాత అందరూ గోరింటాకు పెట్టుకుంటారు. దానితో మొదటి రోజు పండగ ముగిస్తుంది.

రెండవ రోజు తెల్లవారుజామున నోము చేసుకునే వారంతా లేచి, కుంకుడుకాయ తో తలంటుకుని, కొత్త బట్టలు వేసుకుని, గోంగూర పచ్చడి, అన్ని కూరగాయలతో చేసిన పులుసు, పెరుగన్నం తిని, బయటకు వెళ్తారు. నోము చేసుకునే పిల్లలంతా ఒక చోట జేరి ఒకరికి ఒకరు తమ పండిన చేతులు చూపించుకుని మురిసిపోతారు. ఎంత ఎర్రగా పండితే అంత మంచి భర్త లభిస్తాడని ఆనందిస్తారు. పెద్ద పెద్ద చెట్లకి ముందు గానే వేసుకున్న ఉయ్యాలలు ఊగుతారు పాటలు పాడుకుంటూ. రకరకాల ఆటలు ఆడుకుంటారు. దాగుడుమూతలు, నేలాబండా, రంగుల రాట్నం, చెమ్మ చెక్క, వుప్పురు గుప్ప లాంటి ఆటలు ఆడుకుని, ఆనందం మరియు ఆరోగ్యానికి కావలిసిన మంచి శారీరక పరిశ్రమ పొందుతారు. తర్వాత ఇంటికి వెళ్లి, రోజంతా ఉపవాసం ఉండి, సాయం కాలం పూజకి సిద్ధం చేసుకుంటారు. చలిమిడి, పానకం, వడపప్పు, మినపట్లు, ఉండ్రాళ్ళుతో పాటు తమకు వీలు అయిన మధుర పదార్ధాలు తయారు చేసుకుంటారు. సాయంకాలం భక్తి శ్రద్ధలతో పసుపు వినాయుకుని, పసుపు గౌరమ్మను చేసుకుని ఆరోగ్యాన్ని సౌభాగ్యాన్ని ఇవ్వమని షోడశోపచార పూజలు చేసి, అన్ని నివేదనలు చేసి గౌరమ్మ మీద అనేక పాటలు పాడుకుని, ముత్తైదువులకు పసుపు కుంకుమలతో పాటు ఉండ్రాళ్ళు కూడా వాయనం ఇస్తారు. రాత్రి చంద్రుడిని చూసి ఉపవాస దీక్ష విరమిస్తారు. తర్వాత వచ్చే అట్లతద్ది దాకా ఆటపాటలు జరుగుతూనే ఉంటాయి.

అసలు ఈ పండగ మన పెద్దలు మనకు ఎందుకు అందించారంటే ఇది కేవలం ఏదో ఆటపాటలు ఆడుకునే వేడుక మాత్రమే కాదు. ఎండాకాలం ముగిసి శ్రావణ భాద్రపదాలు వానాకాలం. నార్లు నాటుకుని అందరు ఆనందం గా వుండే సమయం. సకాలంలో వానలు సరిపడా కురవాలి. దానికి దేవతలు కరుణించాలి. అందుకని సందర్భాలు కల్పించుకుని దేవతారాధన చేస్తారు. విపరీతమైన వేడి నుండి వానాకాలం లో కలిగే శీతలానికి అలవాటు పడటానికి, చేతి వ్రేళ్ళ ఆరోగ్యానికి గోరింటాకు పెట్టుకుంటారు. వానాకాలం లో జలుబులు అవి రాకుండా మినుములతో చేసిన అట్లు, గోంగూర పచ్చడి తింటారు. పిల్లలంతా కలిసి మెలిసి ఆడుకోవడం వలన ఐకమత్యం పెంపొందుతుంది. ఒక పద్దతి ప్రకారం చేయడం వలన ఆడపిల్లలికి క్రమశిక్షణ, ఆధ్యాత్మిక భావాలు పెరిగి, ఆరోగ్యకరమైన మనస్తత్వాన్ని, అలవరుచుకుంటారు. శారీరక ఆరోగ్యాన్ని పొందుతారు. సకల సౌభాగ్యప్రదాయిని గౌరీ దేవి కనుక గౌరమ్మ పూజ, చదువులకు విజయానికి అధినేత వినాయుకుని పూజ చేస్తారు. మనస్సుకి అధిపతి చంద్రుడు కనుక ఆరోగ్యకరమైన మనస్సు కోసం చంద్ర దర్సనం చేసుకుని భోజనం చేస్తారు.

ఇలా ఎన్నో పద్ధతులను నేర్పి ఎంతో వినోదాన్ని కూడా కలిగించే ఈ పండగను మన ఆడపిల్లలకు దూరం చేయవద్దు. చదువు సంధ్యలు చాలా ముఖ్యమే; వాటి తో పాటు మన సంప్రదాయాలు, ఆచారాలుకూడా మన పిల్లలు మరువరాదు కదా? మనలో చాలా మంది ఈ ఆటపాటలను మిస్ అయ్యే ఉంటారు. కనీసం మన ఆడపిల్లలైనా ఇలాంటి చక్కటి పండగలు చేసుకునే ఒక అందమైన అవకాశం కల్పించి ఉండ్రాళ్ళ తద్దిని మరుగున పడకుండా కాపాడుకుందాము. కాబట్టి తల్లులందరూ ఈ ఏడాది నుండి అయినా ప్రతి సంవత్సరం భాద్రపద బహుళ తదియ నాడు వచ్చే ఉండ్రాళ్ళ తద్ది పండగను తమ ఆడపిల్లలు జరుకునేలా గా చూస్తారు కదూ?

పుణ్య క్షేత్రాలకి వెళితే పుణ్యం


పుణ్యం సంపాదించుకుందాం అనే లక్ష్యంతో పుణ్య క్షేత్రాలకి వెళితే పుణ్యం రావడం కొంచెం సందేహాస్పదమే అని చెప్పుకోవాలి. పుణ్యం సంపాదించుకోవడం కోసం పుణ్యవంతమైన పనులను మనం ఆచరించాలి. అవి ఇష్టాపూర్త కర్మలు, దాన కర్మలు, జప కర్మలు, ఇటువంటి వాటిని అన్నింటినీ సంప్రదాయం సూచించింది. ఇష్టి అంటే యజ్ఞయాగాది హోమములు, పూర్త కర్మలు అంటే చెరువులు త్రవ్వించడం, దేవాలయాలు కట్టించడం, బడి నిర్మించడం, ఆసుపత్రి ఇలాంటివన్నీ కూడా పూర్త కర్మలు అని చెప్పబడ్డాయి. పరిహార క్రియలు సూచించి దానధర్మాలు చేయడం ద్వారా ఎదుటివారికి ఏ వస్తువు అవసరం ఉందో ఆ వస్తువులను వారికి అందించే కర్మను ఆచరించడం ద్వారా పుణ్యం సముపార్జించుకొనవచ్చును. ఉపవాసాదులు చేయడం, జపాలు చేయడం, ఇంకా నిష్ఠలు, సాధనలు ఆచరించడం వీటన్నింటి ద్వారా పుణ్యం సముపార్జించుకొనవచ్చును. తీర్థ క్షేత్రాలకు వెళితే యోగులు, మహానుభావులు, ఋషులు అనేకులు తమ తపశ్శక్తిని ధారపోసి ఆప్రాంతమంతా శక్తివంతం చేసి ఉంటారు కాబట్టి అర్చామూర్తి కూడా విశేష జపతపాదులతో, అభిషేకాలతో శక్తివంతమై ఉంటాడు కాబట్టి దర్శించడం ద్వారా మరికొంత పుణ్యం సముపార్జించుకొనవచ్చును. అయితే పూర్తిగా నిష్కామంతో నేను స్వామి దర్శనం కోసం వెళుతున్నాను, దానధర్మాలు చేస్తున్నాను, స్నానం చేస్తున్నాను, జపం చేస్తున్నాను – ఇటువంటి భావాలతో దర్శిస్తే తప్పకుండా పుణ్యం లభిస్తుంది. తీర్థయాత్రగా కాకుండా విహారయాత్రగా మలచుకుంటే మటుకు ఉన్నపుణ్యం కూడా కరిగిపోతుంది అని చెప్పుకోవచ్చు. పుణ్యం సముపార్జించుకోవాలి అంటే మటుకు సంప్రదాయం చూపించిన మార్గాలు యజ్ఞయాగాది క్రతువులు ఆచరించడం, నియమబద్ధమైన జీవితం గడపడం, దాన క్రియలు ఆచరించడం, ఇలాంటివన్నీ చేస్తే తప్పకుండా మేలు కలుగుతుంది. పుణ్యం కలుగుతుంది, పుణ్యం అంటే ఆనందంగా జీవించడం. మంచి పనుల ద్వారా పుణ్యం సంపాదించుకుందాం. పుణ్య క్షేత్రానికి వెళితే పుణ్యం వస్తుంది కానీ అటువంటి నియమాలతో వెళ్ళాలి. విహారయాత్రగా భావించకూడదు.

ధన్వంతరి మహా మంత్రము


ఈ స్తోత్రము ప్రతి రోజు చదివిన ఎడల సర్వ రోగములు నశించి ఆయురారోగ్యములు కలుగగలవు.

ఎవరికైనా అనారోగ్యము లేక దీర్ఘకాలిక రోగములు వున్నఎడల ఆ రోగ గ్రస్తులు కానీ లేక వారి సంబంధీకులు కానీ ఈ మంత్రము పఠించిన ఎడల ఆ రోగము ఉపశమించును.

ఓం నమో భగవతే
మహా సుదర్శన
వాసుదేవాయ ధన్వంతరయే
అమృత కలశ హస్తాయ
సర్వ భయ వినాశాయ
సర్వ రోగ నివారణాయ
త్రైలోక్య పతయే
త్రైలోక్య విధాత్ర్తే
శ్రీ మహా విష్ణు స్వరూప
శ్రీ ధన్వంత్రి స్వరూప
శ్రీ శ్రీ ఔషధ చక్ర
నారాయణ స్వాహా

ఓం నమో భగవతే
వాసుదేవాయ ధన్వంతరయే
అమృతకలశ హస్తాయ
సర్వ భయ వినాశాయ
త్రైలోక్య నాథాయ
శ్రీ మహా విష్ణవే నమః

తద్దినాలు పెడుతున్నాం కదా… మహాలయ పక్షాలు పెట్టాలా?


మరణించిన తల్లి / తండ్రి తిథినాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయంలో అనాది నుంచి వస్తున్న ఆచారం. పితృతిథినాడు పుత్రుడు తన తండ్రి, తాత, మత్తాతలను / తల్లి నానమ్మ బామ్మలను తలచుకుని పితృయఙ్ఞాన్ని నిర్వహిస్తాడు. మరి పుత్రులు లేనివారి సంగతి ఏమిటి? వారి గతి అథోగతేనా? అంటే..‘కాదు’ అంటుంది శాస్త్రం. మన కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్లికాని సోదర, సోదరీలు మరణించి ఉండవచ్చు. లేదా..పెళ్లయినా సంతానం కలుగని దంపతులు మరణించి ఉండవచ్చు. లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్నపిల్లలు ఉండవచ్చు. లేదా యుద్ధాలలో కానీ, శిక్షల ద్వారా కానీ, ఆత్మహత్యల ద్వారా కానీ, ప్రకృతి వైపరీత్యాల (వరదలు, భూకంపాలు) ద్వారా కానీ గుర్తు తెలియక మరణించి ఉండవచ్చు. అటువంటివారందరికి కూడా తిలోదకాలిచ్చి వారిని ఊర్థ్వలోకాలకు పంపడం కోసం ఈ ‘మహాలయ పక్షాలు’ నిర్దేశించబడ్డాయి. పితృతిథి నాడు మూడు తరాలవారికి (తండ్రి, తాత, ముత్తాత/తల్లి నానమ్మ తాతమ్మ ) మాత్రమే తిలోదకాలతో, పిండప్రదానం యివ్వబడుతుంది. కానీ ఈ ‘మహాలయ పక్షాలు’ పదునైదు రోజులు మన వంశంలో మరణిచిన వారందరికీ మాత్రమే కాక, పుత్రులు లేని గురువులకు (గురువు కూడా తండ్రితో సమానం) స్నేహితులకు కూడా తిలోదకాలతో, పిండప్రదానం ఇచ్చే అర్హత, అధికారం మనకు ఉంది. దీనినే ‘సర్వ కారుణ్య తర్పణ విధి’ అంటారు. ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి, తద్దినం పెట్టకపోతే.., ఆ తద్దినం పెట్టని దోషం ‘మహాలయం’ పెట్టడం వలన పోతుంది. మహాలయ పక్షాలు పదునైదు రోజులు మన పితృదేవతలు ‘మా వారసుడు పితృయఙ్ఞం చేయకపోతాడా.., మా ఆకలి తీర్చకపోతాడా’ అనే ఆశతో మన ఇంటిని ఆవహించి ఉంటారు. పితృయఙ్ఞం చేసిన వారసునికి సకల ఐశ్వర్యాలు కలగాలనీ…పిల్లపాపలతో ఆనందంగా ఉండాలనీ దీవిస్తారు. పితృయఙ్ఞం చేయని వారసుని వంశం.. నిర్వంశం కావాలని శపించి కోపంగా వెళ్ళిపోతారు. వంశం నిర్వంశం కావడం అంటే… సంతానం కలుగక పోవడమే కదా. సంతనం లేనివారి గతి ఎలా ఉండుందో తెలుసుకున్నాం కదా. అందుచేత తప్పకుండా ‘మహాలయ పక్షాలు’ పెట్టి తీరాలి.

మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి?


– సాధారణంగా తండ్రి చనిపోయిన తిథినాడు ‘మహాలయం’ పెట్టడం ఉత్తమమం. ఏ కారణంచేతనైనా అలా పెట్టడం వీలుకాని పరిస్థతిలో ‘మహాలయ అమావాస్య’నాడు
పెట్టడం ప్రశస్తం. దీనినే ‘సర్వ పితృ అమావాస్య’ అంటారు. ఈ రోజునే మరణించిన బంధువులందరికీ..వారి వారి తిథులతో సంబంధం లేకుండా ‘మహాలయం’ పెట్టాలి.
– క్రిందటి సంవత్సరం చనిపోయిన వారికి ‘చేత భరణి లేక భరణి పంచమి’ తిథులలో అనగా..మహాలయ పక్షాలు మొదలైన 4 లేక 5 రోజున మహాలయం పెట్టాలి.
– భార్య మరణించిన వాడు ‘అవిధవ నవమి’నాడు అనగా తొమ్మిదవ రోజున మహాలయం పెట్టాలి. ఆ రోజున సుమంగళిగా మరణించిన తన భార్యను తలచుకుని ఒక సుమంగళికి భోజనం పెట్టి, పసుపు, కుంకుమ, గాజులు, పూవులు, చీర,రవికెలగుడ్డ పెట్టి సత్కరించి పంపాలి.
– చిన్న పిల్లలు చనిపోతే.. వారికి పన్నెండవ రోజున ‘మహాలయం’ పెట్టాలి. చిన్న పిల్లలు అంటే..ఉపనయన వయస్సు (పది సంవత్సరములు) దాటనివారు. ఒకవేళ పది సంవత్సరముల వయస్సు లోపే ఉపనయనము జరిగి ఉంటే.., ఆ పిల్లవాడు మరణించిన తిథినాడే ‘మహాలయం’ పెట్టాలి.
– ఇక ప్రమాదాలలో కానీ, ఉరిశిక్ష వల్ల కానీ, ఆత్మహత్య చేసుకుని మరణించిన వారికి ‘ఘట చతుర్థి లేక ఘాయల చతుర్థి’నాడు అనగా అమావాస్య ముందురోజున పెట్టాలి.
మహాలయము పెట్టే కర్త శుచిగా స్నానంచేసి, పవిత్రమును(దర్భలతో చేసిన ఉంగరము) ధరించి, శ్రధ్ధగా, భక్తిగా, మంత్రపూర్వకంగా ఐదుగురు బ్రాహ్మణభోక్తలతో ఈ పితృకార్యాన్ని నిర్వహించాలి. ఐదుగురు భోక్తలు ఎందుకంటే…

1.పితృదేవతలకు అధిపతి శ్రీ మహావిష్ణువు. కనుక విష్ణుదేవతా ప్రీత్యర్థం ఒక భోక్త.
2.ఇది విశ్వేదేవస్థానం. విశ్వ, ఆర్ద్ర దేవతల ప్రీత్యర్థం ఒక భోక్త.
3.ఇది పితృస్థానం. తండ్రి, తాత, ముత్తాతల ప్రీత్యర్థం ఒక భోక్త.
4.ఇది మాతామహస్థానం. తల్లి తండ్రి, తాత, ముత్తాతల ప్రీత్యర్థం ఒక భోక్త.
5.ఇది సర్వ కారుణ్యస్థానం. తండ్రి తరపు బంధువుల, తల్లి తరపు బంధువుల, గురువుల, స్నేహితుల, తక్కినవారి ప్రీత్యర్థం ఒక భోక్త.

ఈ విధంగా మీ పురోహితుని సూచనానుసారం ఈ పితృకార్యాన్ని హోమ, తర్పణ, పిండప్రదానాది విధులతో అత్యంత శ్రద్ధగా నిర్వహించాలి. ఎందుకంటే.. ‘శ్రద్ధయా క్రియతే ధేయం ..శ్రాద్ధం’ అన్నారు పెద్దలు. అయిదుగురు భోక్తలతో ఈ పితృయఙ్ఞం జరిపించే ఆర్థికస్థోమత లేని పక్షంలో…కనీసం ఒక భోక్తతో అయినా ఈ క్రతువు జరపాలి గానీ…మహాలయం పెట్టకుండా మాత్రం ఉండకూడదు. మరొక్క విషయం. మనిషన్నాక బలహీనతలు సహజం. కనుక వివాహేతర సంబంధాల వల్ల జన్మించిన సంతానానికి మాత్రం ఈ పితృకార్యం చేసే అర్హత, అధికారం లేదు. శాస్త్రం ఆ వీలు కల్పించలేదు. కనుక మనకీ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు విధివిధాన పితృకర్మలు నిర్వహించడం.., వారి పుత్రులుగా మన విధి, కర్తవ్యం, బాధ్యత. ఈ బాధ్యతను ప్రతి పుత్రుడు గుర్తించి, ఈ మహాలయ విధులు భక్తి, శ్రద్ధలతో నిర్వహించి పతృదేవతల ఆశీస్సులు అందుకుందాము.

భక్తితో గణపతికి చిన్న బెల్లం ముక్క నివేదన చేసినా చాలు.(కుబేరుడు,ఈశ్వరుడు,గణపతి)


ఐశ్వర్యానికి కారుకుడు ఈశ్వరుడు(శివుడు). ఈశ్వరానుగ్రహంతో ఐశ్వరం పొందిన కుబేరుడికి ఒకసారి తానే ధనవంతుడిననే అహకారం కలిగింది. అందువల్ల దేవతలందరికి మంచి విందు భోజం ఏర్పాటు చేసి తన గొప్పతనాన్ని చాటుకోవాలని తలచాడు కుబేరుడు. దేవతలందరిని ఆహ్వానించి, శివపార్వతులను ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్ళాడు. శివుడు కొండల్లో ఉంటాడు, ఒక ఇల్లు కూడా ఉండదు, నా ఇంటిని చూసి శివుడు ఆశ్చర్యపోతాడు, ఎంత బాగుందో అంటూ పొగుడుతాడు, అప్పుడు దేవతల్లో నా కీర్తి పెరుగుతుందనే ఆలోచనలతో కైలాసం చేరుకున్నాడు. శివుడు ఇల్లు లేకపొవడం ఏమిటి? లోకమంతా శివుడి నివాసమే. శివుడు లేని ప్రదేశమే లేదు. శివుడు యోగి కనుక నిరాడంబరంగా, హిమాలయాల్లో ప్రశాంతమైన జీవనం సాగిస్తుంటాడు.

శివుడు సర్వాంతర్యామి, ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమంకుంటున్నారో అన్ని తెలుసుకోగలడు. కుబేరుడు అహాన్ని పసిగట్టాడు. పార్వతీదేవి కూడా కుబేరుడి పధకాన్ని అర్దం చేసుకుంది. కుబేరుడు వచ్చేసరికి శివపార్వతులు మాట్లాడుకుంటున్నట్టు నటించారు. కుబేరుడు వచ్చి, మహాదేవా! మీరు, పార్వతీదేవి కలిసి మా ఇంట్లో నిర్వహించే విందు భోజనానికి తప్పక రావాలి అన్నాడు. శివుడు తనకు కుదరదన్నాడు, భర్త రాకుండా తాను కూడా రానన్నది పార్వతీ దేవి. ఇంతలో వినాయకుడు కైలాసానికి వచ్చాడు. వస్తూనే ‘అమ్మా! ఆకాలేస్తోంది, ఏదైనా ఉంటే పెట్టు’ అన్నాడు. పార్వతీదేవి గణపతి వైపు కనుసైగ చేసి ‘కుబేరా! మా గణపతి మీ ఇంటికి విందుకు వస్తాడు’ అనగా, ‘ఔనౌను, గణపతికి విందు భోజనం అంటే మహాఇష్టం. మా బదులుగా గణపతిని తీసుకెళ్ళు’ అన్నాడు పరమశివుడు.

హా! ఈ ఏనుగు ముఖమున్న పసిపిల్లవాడా, నా ఇంటికి విందుకోచ్చేది. ఎంత తింటాడులే అనుకుంటూ గణపతిని తీసుకుని అలకాపురిలో ఉన్న తన భవనంలోకి తీసుకెళ్ళి, తన భవనంలో ఉన్న సౌకర్యాలను, ఇతర సంపదలను చూపిచసాగాడు. ఇవన్నీ వ్యర్ధం, త్వరగా ఆహారం పెట్టండి అని గణపతి అనగా, కుబేరుడు భోజనం సిద్ధం చేయవలసిందిగా అక్కడున్న పనివారికి ఆజ్ఞ చేశాడు.

వెంటనే బంగారు కంచం పెట్టి, రకరకాల తీపి పదార్ధలు, పానీయాలు, కూరలు, పండ్లు….. గణపతికి వడ్డించారు. కుబేరుడు చూస్తుండగానే ఒక్కపెట్టున గణపతి కంచంలో ఉన్న ఆహారాన్ని, అక్కడ పాత్రల్లో పెట్టిన ఆహారాన్ని తినేసి, ఇంకా తీసుకురండి అంటూ ఆజ్ఞ చేశాడు. సేవకులు వంటశాలలో ఉన్న ఆహారం మొత్తాన్ని తీసుకువచ్చి గణపతికి వడ్డించారు. అయినా గనపతి ఆకలి ఇసుమంతైనా తగ్గలేదు, కడుపు నిండలేదు. ఇంకా కావాలి అంటూ గణపతి అడిగాడు.

వంటవారికి ఆహారం వండడం, వండగానే గణపతికి వడ్డించడమే పనైపోయింది. కాసేపటికి కుబేరుడి వంటశాల మొత్తం ఖాళీ అయిపోయింది. విషయం కుబేరుని తెలిసింది. తన సంపద మొత్తం తరిపోతోంది కానీ, గణపతి కడుపు నిండడంలేదు, ఏమి చేయాలో అర్ధంకాలేదు. ఇంతలో గణపతి ఆగ్రహంతో ఊగిపోతూ కుబేరుని పిలిచి, నీ ఇంటికి విందుకు రమ్మని, నాకు ఆహారం పెట్టకుండా అవమానిస్తున్నావ్ అంటూ పలికాడు. కుబేరుడికి విషయం అర్ధమైంది. తనకున్న సంపద ఆ పరమాత్ముడిని ఏ మాత్రం సంతృప్తి పరచలేదని, అన్ని ఇచ్చిన భగవంతుడినే దగ్గరే దర్పాన్ని చూపాలనుకోవడం మూర్ఖత్వమని, తన అహకారం అణచడానికే దైవం ఈ విధంగా చేశాడని గ్రహించి పరుగుపరుగున కైలాసానికి వెళ్ళాడు.

శివా! శంకరా! నేవే దిక్కు. ఐశ్వర్యానికి నన్ను నీవే అధిపతిని చేశావని మరిచి అహకారంతో ప్రవర్తించాను. అందుకు ప్రతిగా గణపతి నా సంపద మొత్తాన్నీ ఖాళీ చేసి, అన్ని ఇచ్చిన భగవంతుడే, అహంకరించినవారి సర్వసంపదలు తీసివేస్తాడని నిరూపించాడు. మీ బిడ్డడైన గణపతి ఆకాలి తీర్చలేకపోతున్నాను. ఏదైనా మార్గం చూపించండి అన్నాడు. అప్పుడు శివుడు “కుబేరా! నేవు ఇంతసేపు అహకారంతో గణపతికి భోజనం పెట్టావు. అందుకే గణపతి సంతృప్తి చెందలేదు. గణపతికి కావల్సినది భక్తి మాత్రమే. నీకు ఎంత ఉందన్నది అతనికి అనవసరం, నీవు ఎంత భక్తితో సమర్పించావన్నది మత్రామే గణపతి చూస్తాడు. ఇదిగో ఈ గుప్పెడు బియ్యం తీసుకుని, అహకారం విడిచి, చేసిన తప్పకుని ఒప్పుకుని పరమభక్తితో గణపతికి సమర్పించు” అన్నాడు.

కుబేరుడు ఆ గుప్పెడు బియ్యాన్ని ఉడికించి, గణపతికి భక్తితో సమర్పించాడు. ఆ గుప్పెడు బియ్యం తినగానే గణపతికి కడుపు నిండి, త్రేనుపులు వచ్చాయి. గణపతి సంతృప్తి చెందాడు. సమస్త లోకాల ఆకలి తీరుస్తున్న పరమాత్మకు ఎంతని పెట్టగలం. ఎంత పెడితే ఆయన ఆకలి తీరుతుంది. భగవంతుడు భక్తికి లొంగుతాడు, సంపదలకు, నైవేధ్యాలకు, దర్పాలకు కాదు. భక్తితో గణపతికి చిన్న బెల్లం ముక్క నివేదన చేసినా చాలు, అదే మహాప్రసాదంగా స్వీకరిస్తాడు.

మనం దేవుడికి ఎంత సమర్పించామన్నది కాదు, ఎంత భక్తితో ఇచ్చామన్నది ముఖ్యం. ‪‎కుబేరుడిఅహకారాన్ని అణిచివేసిన ‪‎గణపతి‬, మనలోని అహకారాన్ని కుడా పటాపంచలు చేయుగాకా.

ఓం గం గణపతయే నమః

ఘృశ్మేశం


ఘృశ్మేశం

దక్షిణదిశయందు దేవగిరియను పేరుగల ఒక పర్వత శ్రేష్ఠము కలదు. అది చూచుటకు అద్భుతముగను, నిత్యము పరమశోభతో సంపన్నమైయుండును. దాని సమీపమున భరద్వాజ కులోద్భవుగు సుధర్ముడను బ్రహ్మవేత్త, బ్రాహ్మణుడు నివసించుచుండెను. ఆయన ధర్మపత్ని పేరు సుదేహ. ఆమె ఎల్లవేళల శివధర్మ పాలనయందు ఆసక్తురాలైయుండెడిది. ఇంటి వ్యవహారములందు నిపుణురాలు. పతిసేవయందు లగ్నమైయుండెడిది. ద్విజశ్రేష్ఠుడగ సుధర్ముడు కూడా దేవతలను, అతిథులను పూజించెడివాడు. వేదోక్త మార్గమునవలంబించెడి వాడు. నిత్యాగ్నిహోత్రుడు. మూడు కాలములందు సంధ్య చేయుటవలన ఆతని కాంతి సూర్యునితో సమానముగ తేజరిల్లుచుండెను. వేదశాస్త్రముల మర్మమునెరిగినవాడు. శిష్యులకు చదువు చెప్పెడివాడు. ధనవంతుడైన ఆతడు గొప్ప దాతకూడ. సౌజన్యాది సద్గుణ నిలయుడు. శివసంబంధమైన పూజాకార్యములందు సదా నిమగ్నుడై యుండెడివాడు. స్వయముగ శివభక్తుడే. శివభక్తులనిన అతనికి మిగుల ప్రీతి.

శివభక్తులకు కూడ అతడు మహా ఇష్టుడు. ఇవన్నియు ఉండి కూడ అనికి పుత్రులు లేకుండెను. దీనివలన బ్రాహ్మణునకు దుఃఖము కలిగెడిది కాదు. కానీ ఆ బ్రాహ్మణి మిక్కిలి బాధపడుచూ పట్టుదలతో తన సోదరియైన ఘుశ్మాతో తన భర్తకు రెండవ వివాహము జరిపించెను. “ఇప్పుడు నీవు నీ సోదరిని ప్రేమించుచున్నావు కానీ ఈమెకొక పుత్రుడు జన్మించినచో అప్పుడీమె వలన నీలో ఈర్ష్య జనించును” అని సుధర్ముడు వివాహమునకు ముందు సుదేహకు నచ్చజెప్పెను. “నేను నా సోదరియందు ఎప్పుడును ఈర్ష్యాళువును కాను” అని ఆమె మాట ఇచ్చెను. వివాహమైన తదుపరి ఘుశ్మా దాసివలె తన అక్కకు సేవ చేయసాగెను. సుదేహ కూడా ఆమె ఎడల మిగుల ప్రేమతో వ్యవహరించుచుండెను. ఘుష్మా శివభక్తురాలైన తన అక్క ఆదేశానుసారము ప్రతిదినము నూట ఒక్క పార్థవ శివలింగములను తయారుచేసి విధి పూర్వకముగ పూజించి సమీపముననున్న చెరువులో నిమజ్జనము చేయుచుండెను. శంకరుని కృపవల్ల సౌభాగ్యవంతుడు, సద్గుసంపన్నుడైన ఒక చక్కటి కుమారుడు ఆమెకు కలిగెను. ఘుశ్మాకు కొంత అభిమానము పెరిగెను. దీనితో సుదేహ మనస్సునందు అసూయ జనించెను. యుక్త వయస్సు రాగానే ఆ కుమారునకు వివాహము జరిగెను.

కోడలు ఇంటికి వచ్చెను. సుదేహ ఇంకనూ ఎక్కువగ ద్వేషింపసాగెను. ఒకనాటి రాత్రి ఆమె నిదురించుచున్న కుమారుని శరీరమును కత్తితో ముక్కలు ముక్కలు చేసి చంపివేసెను. ఖండింపబడిన అంగములను ఘుశ్మా ప్రతిదినము పార్థివలింగములను విసర్జనము చేయు చెరువులో పడవేసెను. ఇంటిలో నిశ్చింతగా నిదురించెను. సూర్యోదయమున లేచి ఘుశ్మా నిత్యపూజలు చేయసాగెను. సుధర్ముడు స్వయముగ నిత్యకర్మలందు లగ్నమయ్యెను. ఇదే సమయమున సుదేహ కూడా నిదురలేచి మిక్కిలి ఆనందముతో ఇంటిపనులు చేయసాగెను. ఆమె హృదయమునందు మొదటినుండి మండుతున్న ఈర్ష్యాగ్ని ఇప్పుడు ఆరిపోయెను. ప్రాతఃకాలము కోడలు లేచి తన భర్త శయ్యను చూసెను. అది రక్తసిక్తమైయుండెను. దానిమీద కొన్ని శరీరభాగములు ఆమెకు కనిపించెను. దీనితో ఆమెకు మిగుల దుఃఖము కలిగెను. ఆమె అత్త ఘుశ్మా దగ్గరకు వెళ్ళి నివేదించి రోదింపసాగెను. పెద్ద భార్య సుదేహ కూడా పైపైన దుఃఖించెను గాని మనస్సంతయు సంతోషముతో నిండియుండెను. ఘుశ్మా ఆ సమయమున కోడలు దుఃఖమును చూసి తన నిత్యపూజల వ్రతమునుండి విచలిత కాలేదు. ఆమె మనస్సు కుమారుని చూచుటకు ఏ కొంచెము కూడా ఉత్సాహ పడలేదు. మధ్యాహ్నము వరకు పూజలు సమాప్తము చేసికొని తన పుత్రుని శయ్యవైపు దృష్టి సారించెను. ఆమె మనస్సులో ఏ కొంచెము కూడ దుఃఖము లేకుండెను. ఈ కుమారుని ప్రసాదించిన వాడే వానిని రక్షించును. అని శివునీద నమ్మకముతో ధైర్యమును వహించియుండెను. మునుపటివలె పార్థివ శివలింగమును తీసుకొని స్వస్థ చిత్తముతో శివుని నామోచ్ఛారణ చేయుచు చెరువు గట్టుకు వెళ్ళెను. తిరిగి వచ్చు సమయమున ఆమెకు తన పుత్రుడు చెరువు తీరాన నిలబడి కనిపించెను.

అయిననూ ఘుశ్మాకు హర్షమును కలుగలేదు, విషాదమును కలుగలేదు. అప్పుడు ఆమె ఎడల శివుడు సంతుష్టుడై ఆమె ఎదుట ప్రత్యక్షమై వరము కోరుకొమ్మనెను. దుష్టురాలగు నీ సవతి ఈ బాలుని చంపివేసెను, ఆమెను త్రిశూలముతో హతమార్చెదను. ఘుశ్మా శివునకు నమస్కరించి “ప్రభూ! ఈ సుదేహ నాకు అక్క. కనుక ఈమెను మీరు రక్షింపవలయును.” అని వరమడిగెను. ఘుశ్మా మాటలు విని పరమేశ్వరుడు ఇంకను ప్రసన్నుడై ఇంకేదైనా వరమును కోరుకొమ్మనెను. శివుని మాటలు విని ఘుశ్మా “ప్రభూ! మీరు వరము నియ్యదలచినచో ప్రజల రక్షణ కొరకు సదా ఇచట నివసింపుడు. నా పేరుతోనే మీకు ఖ్యాతి రావలయును” అని కోరుకొనెను. అప్పుడు శివుడు “నేను నీనామముతోనే ఘుశ్మేశ్వరుడని పిలువబడుదును. సదా ఇచటనే నివాసముందును. అందరికి సౌఖ్యమును ప్రసాదించెను. ఈ సరోవరము శివలింగముకు ఆలయమగును. ఈ సరోవర దర్శన మాత్రము చేత సకలాభీష్టములు ప్రసాదించును. నీ వంశమందు నూట ఒక్క తరముల వరకు పుత్రులందరు మిగుల గుణవంతులగుదురు. అట్టి నీ వంశము విస్తృతమై శోభాయమానమై అలరారుచుండును.”అని పలికి శివుడు అచట జ్యోతిర్లింగ రూపమున స్థితుడయ్యెను. జీవించియున్న పుత్రుని చూసి సుదేహ మిగుల సిగ్గుపడెను. ఆమె తన భర్తను, ఘుశ్మాను క్షమించమని ప్రార్థించెను. తన పాపమును తొలగించుకొనుటకు ప్రాయశ్చిత్తమును చేసుకొనెను. ఈ లింగమును దర్శించి పూజించుట వలన సదా సుఖ సమృద్ధులు సమకూరును. ఈజ్యోతిర్లింగ కథను చదివినవాడును, వినిన వాడును సకల పాపములనుండి ముక్తుడగును. భోగమోక్షములను పొందును.