భగినీ హస్త భోజనం( దీపావళి వెళ్ళిన రెండవనాడు వస్తుందీ పండుగ )


సోదరి ఇంట భోజనం చేయాలి

కార్తీక శుద్ధ విదియ, అంటే దీపావళి వెళ్ళిన రెండవనాడు వస్తుందీ పండుగ. సోదరీ సోదర ప్రేమకి అద్దం పట్టే పండుగల్లో రాఖీ పండుగ తర్వాత చెప్పుకోదగినది ఇది. ఈనాడు అన్నదమ్ములు తమ తమ అక్కాచెల్లెళ్ళ ఇళ్ళకు వెళ్ళి వారి చేతివంట తిని వారిచేత తిలకం దిద్దించుకుంటారు. రక్షాబంధనంలో అన్నదమ్ములు తమ సోదరి రక్ష (రాఖీ) కట్టినందుకు ఆమె యోగక్షేమాలు తాము చూస్తామని, రక్షిస్తామని చెపుతారు. రాఖీ సోదరి క్షేమానికి సంబంధించినది.
“భయ్యా ధూజీ” అనే పేరుతొ ఉత్తరదేశంలో బాగా ప్రాచూర్యం పొందిన భగినీ హస్తభోజనం సోదరుని క్షేమానికి సంబంధించినది.

ఒకప్పుడు యముడు తన భటుల్ని కర్తవ్య నిర్వహణలో ఎప్పుడైనా మనసుకి బాధ కలిగిందా? అని అడిగితె ఒక భటుడు భర్త ప్రాణాలు హరించినప్పుడు నవవధువు పడిన వేదన హృదయ విదారకంగా ఉండి తన మనసు పాడైందని చెపుతాడు. యముడు కూడా బాధపడినా చేయగలిగిందేమీ లేదని చెపుతూ … “ఎవరైనా కార్తీక శుద్ధ విదియ నాడు సోదరికి బహుమానాలిచ్చి, ఆమె చేతితో తిలకం పెట్టించుకుంటే అపమృత్యువును నివారించవచ్చు” అంటాడు. దీనికి కారణం ఉంది.

యముడు యమున సూర్యుని పిల్లలు. సోదరిపైన ఉన్న ప్రేమతో ఎవరైతే తన సోదరి అనుగ్రహానికి పాత్రులౌతారో వారికి దూరంగా ఉంటానని వరం ఇచ్చాడట. అందువల్లనే యమునలో స్నానం చేసిన వారికి అపమృత్యు బాధ ఉండదట. అందరూ యమునా స్నానం చేయలేరు కదా! సోదరసోదరీ పరమకు నిదర్శనంగా నిలిచినా యమున, యముల బంధాల్ని గుర్తు చేసుకుంటూ కార్తీక శుద్ధ విదియ నాడు భగినీ (సోదరి) హస్త భోజనం చేసినట్లయితే అదే ఫలితాన్ని పొందవచ్చు. ఉత్తర భారతంలో ఇది చాలా ప్రాంతాలలో జరుపుకునే పండుగ. ఆంధ్రులకు దానిని గురించి తెలిసినా పెద్దగా పాటించరు. రక్షాబంధనం కూడా అంతే ఈ మధ్య ప్రాంతీయ భేదాలు సమసిపోవటం కారణంగా ఇవి మన దాకా కూడా వచ్చాయి. కాని, రాఖీ పూర్ణిమ ప్రాచుర్యం పొందినంతగా భగినీ హస్తభోజనం ఆంధ్రదేశంలో వ్యాప్తి పొందలేదు.

దీపారాధన


‘దీపేన సాధ్యతే సర్వం’ అని శాస్త్రవచనం. ‘దీపంతో దేనినైనా సాధించవచ్చు’ అని భావం. నిత్యం దీపారాధన భారతీయుల సంప్రదాయం. ఉభయసంధ్యల్లో ఇంట్లో వెలిగించిన దీపం ఐశ్వర్యకారకం- అని ధార్మిక గ్రంథాలు బోధిస్తున్నాయి. ‘ఏదైనా కోరిక తీరాలంటే, ఒక దీపాన్ని వెలిగించి- ఖర్జూరమో, ఎండుద్రాక్షో లేదో ఏదైనా ఫలమో నైవేద్యం పెట్టి నమస్కరించితే చాలు’ అని ఆనవాయితీగా దీపారాధన కొనసాగుతోంది. ఇలా దీపారాధన చేయడంవల్ల ఏ ప్రయోజనమైనా పొందవచ్చు- అన్నది శాస్త్రోక్తి.

దేవతలు ప్రకాశస్వరూపులనీ, కాంతి-శుభానికీ, జ్ఞానానికీ, శాంతికీ సంకేతమనీ చాటిచెప్పే ఆర్షభావన దీప ప్రజ్వలనలో కనిపిస్తోంది. జ్యోతిని వెలిగించడం శుభారంభం. తేజోమయులైన దేవతలు దీపంద్వారా సంతోషిస్తారనీ, దీపప్రకాశంలో సన్నిహతులవుతారనీ పురాణ ఋషుల దర్శనం. దీపకాంతి దివ్యత్వ ప్రతీక కనుక, ఆ దివ్యత్వాన్ని కావాలని ఆశిస్తూ దీపంద్వారా వ్యక్తీకరించుకుంటున్నాం. ‘దీపమున్న చోట దేవతలుంటారు’- అనడం ఈ కారణం వల్లనే.

కేవలం దీపాన్ని మాత్రమే వెలిగించి, ఆ జ్యోతిని ఆలంబనగా పరంజ్యోతి అయిన పరమాత్మను ధ్యానించడం ఒక యోగ ప్రక్రియ. భర్తృహరి తన శతక సాహిత్యంలో పరమేశ్వరుని ‘జ్ఞానదీపం’గా అభివర్ణించాడు. ఈ దీపం యోగుల హృదయగృహంలో సుస్థిరంగా దీపిస్తోందని సంభావించాడు. దీపావళిలో ఎన్నో జ్యోతిర్లింగాలు!

లక్ష్మీదేవిని దీపజ్యోతిగా, జ్యోతిని లక్ష్మీమూర్తిగా భావించిన ఉపాసనాశాస్త్రం మనకు ఉంది. లక్ష్మి శ్రీ- అనే మాటకు ‘కాంతి, శోభ’ అని అర్థాలు. అందుకే దీపకళికను లక్ష్మీరూపంగా భావించడం, దీపరాత్రిని లక్ష్మీపూజకు ప్రధానంగా వ్యవహరిస్తారు. అందునా- ఆనందం, ఐశ్వర్యం- అనే భావనకు ఒక దేవతారూపాన్నిస్తే- అదే ‘లక్ష్మీదేవి’. ఆ దివ్యభావనను అనుసంధానించడమే దీపోపాసనలోని పరమార్థం. ఐశ్వర్యం, ఆనందం మెండుగా ఉన్నప్పుడు ముఖం ‘వెలిగి’పోతుంది.

ధన్వంతరి


భాగవతంలో క్షీరసాగర మధనం సమయంలో అమృత కలశాన్ని చేబట్టుకొని అవతరించిన శ్రీమహావిష్ణువు అవతారం.

బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం భాస్కరుని (సూర్యభగవానుని) వద్ద ఆయుర్వేదం నేర్చుకొన్న ధన్వంతరి. ఇతడు సూర్యుని 16 మంది శిష్యులలో ఒకడు.

కాశీరాజు దేవదాసు ధన్వంతరి (అంటే “ధన్వంతరి” అన్న బిరుదు కలిగిన కాశీరాజు “దేవదాసు”)- ఇతడు శుశ్రుతునికి ఆయుర్వేదం, శస్త్ర చికిత్స నేర్పాడు. ఇతడు పురాణాలలో చెప్పబడిన ధన్వంతరి అవతారమన్న విశ్వాసం ఉంది.

విక్రమాదిత్యుని ఆస్థానంలో “నవరత్నాలు”గా ప్రసిద్ధులైన పండితప్రతిభామూర్తులలో ఒకడు. ఇతడే “ధన్వంతరి నిఘంటువు” అనే వైద్య పరిభాషిక పదకోశ గ్రంధాన్ని రచించాడని ఒక అభిప్రాయం.

ఆశ్వయుజ మాసం బహుళ త్రయోదశి నాడు ధన్వంతరి జయంతి. ఆరోగ్యమే మహా భాగ్యం అంటారు పెద్దలు. శరీరం ఆరోగ్యంగా లేకపోతే మనస్సుకు ఏకాగ్రత ఉండదు. సకల సుఖాలు అనుభవించడానికి ఆరోగ్యమే ఉండాలి. అందుకే పెద్దలు దీవించేటప్పుడు ‘‘ఆయురారోగ్య ఐశ్వర్య, సంతాన, ఉద్యోగ ప్రాప్తిరస్తు’’ అంటారు. ఆయువు తర్వాత ఆరోగ్యానికే పెద్దలు ప్రాముఖ్యత ఇచ్చారని తెలుస్తుంది. ఆరోగ్యానికి అధిదేవత ధన్వంతరి. సకల రోగాల విముక్తికై మనమంతా ధన్వంతరిని పూజించాలి. సాక్షాత్తూ విష్ణుమూర్తియే ధన్వంతరిగా పాలకడలి నుండి అమృతభాండం పట్టుకుని అవతరించిన రోజు. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడేవారు ఈ రోజున ధన్వంతరి పూజ తప్పక చేయాలి.

వైద్యవిద్యకు అధిదేవుడు. సనాతన వైద్య శాస్తమ్రైన ఆయుర్వేదాన్ని వృత్తిగా గైకొన్నవారు ఈ రోజు ధన్వంతరీ పూజ చేస్తారు. యాగాలు చేస్తారు. వైద్యులు మాత్రమే ధన్వంతర యాగాన్ని, పూజలను చేస్తారని, మరెవ్వరూ చేయరు అనే భావన చాలామందిలో ఉంది. కాని ఈ ధన్వంతరి భవరోగాలను పోగొట్టే దైవం. అందుకే ధన్వంతరి వ్రతాన్ని ఆనవాయితీగా లేనివారు కూడా ఆనాడు శ్రీమన్నారాయుణిడిని, ధన్వంతరిని స్మరించుకొని హరినామస్మరణ చేస్తే సకల రోగాలు పటాపంచలవుతాయి. సంపూర్ణ ఆరోగ్యం సంప్రాప్తమవుతాయి. ఆయుర్వేదానికి ప్రథమ గురువు సుశ్రుతుడు. ధన్వంతరి నుండి మొదట ఆయుర్వేద శాస్త్రం ఉపదేశం పొందినాడు. ప్రపంచంలోని ప్రతి వస్తువులోనూ ఔషధ గుణాలు, ప్రతి చెట్టు ఔషధాల నిస్తుందని చెప్తుంది ఆయుర్వేదం. కేరళ రాష్ట్రంలో త్రిశూరవద్ద ధన్వంతరి ఆలయం ఉంది. అనారోగ్యంతో బాధపడేవారు ఈ ఆలయాన్ని సందర్శించి విష్ణు సహస్రనామార్చన చేస్తే అన్ని రోగాలు పటాపంచలవుతాయని భక్తుల నమ్మకం.

పురాణ కథనం ప్రకారం సురాసురులు కలిసి పాలసముద్రాన్ని మధించారు. ధర్మాచరణతో మనుగడ సాగించేవారికి అపారమైన జ్ఞానాన్ని, అనంతమైన సంపదను అందించడానికి విశ్వపాలకుడు, జగద్రక్షుడైన ఆ నారాయణుడు నడుం కట్టాడు. దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని మధించినప్పుడు ముందుగా హాలాహలం పుట్టింది. ఆ హాలాహలాన్ని పరమశివుడు మింగేసి గరళకంఠుడు అయ్యాడు. ఆ తర్వాత కామధేనువు, ఐరావతం, ఉచె్తై్చశ్రవం పుట్టాయి. ఆ తర్వాత శ్రీ మహాలక్ష్మీ, కల్పవృక్షం ఉద్భవించింది. చిట్టచివరగా శ్రీమన్నారాయణుడు పరిపూర్ణ ప్రశాంత సాకార పరంజ్యోతి స్వరూపుడుగా ధన్వంతరి రూపం ధరించి చేతిలో అమృత కలశంతో వెలుపలికి వచ్చాడు. అమృత కలశంలోనే సమస్త శారీరక, మానసిక, అజ్ఞానరోగాలకు ఔషధాలు నిక్షిప్తమై ఉన్నాయి. శ్రీమహావిష్ణువుకు ప్రతి రూపమైన ధన్వంతరి నాలుగు భుజాలుతో ఉద్భవించాడు. దేవదానవులు అతనికి నమస్కరించారు.

వైభవంగల ధన్వంతరి (శ్రీమహావిష్ణువు) పటాన్ని కుంకుమతో, పుష్పాలతో అలంకరించి, స్వామి సహస్రనామాన్ని పఠిస్తూ తెల్లపూవులు లేదా తులసీ దళాలతో అర్చించాలి. అనంతరం పాయసాన్ని నివేదించాలి. ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ ముందుగా స్వీకరించి అనంతరం ఖచ్చితంగా కనీసం అయిదుగురికైనా పంచాలి. అమృతం పంచిన తర్వాత ఇంద్రుని ప్రార్థించి ధన్వంతరి దేవవైద్య పదవి స్వీకరించాడు. కాలక్రమంలో భూమిపై మనుష్యులు అనేక రోగాల పాలయ్యారు. ఇంద్రుని ప్రార్థన మేరకు ధన్వంతరి కాశీరాజైన దివ్‌దాసుగా అవతరించాడు. అప్పుడే ‘్ధన్వంతరి సంహిత’ పేరుతో ఆయుర్వేద మూల గ్రంథం అందించాడు.

ధన త్రయోదశి


దేవతలు, దానవులు అమృతం కోసం క్షీరసాగరం చిలుకుతున్న సమయంలో ఆ పాలసముద్రం నుంచి శ్రీ మహాలక్ష్మి జన్మించింది. అంతే కాదు. సంపదలను ప్రసాదించే కల్పవృక్షం, కామధేనువు, దేవవైద్యుడు ధన్వంతరి కూడా శ్రీ మహాలక్ష్మితో పాటే జన్మించారు. ఆ రోజు ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి. ఎంత చదువు చదివినా.,, ఎన్ని తెలివితేటలు ఉన్నా., శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లేకపోతే జీవితం శూన్యం. అందుకే.. సర్వ సంపద ప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం సర్వ మానవాళి ఈ రోజున శ్రీమహాలక్ష్మిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి, ఆమె ఆశీసులు అందుకుంటారు. శ్రీమహాలక్ష్మి .., ధనానికి ప్రతిరూపం. అందుకే., ఆమె జన్మదినమైన ఈ ఆశ్వయుజ కృష్ణ త్రయోదశిని..‘ధన త్రయోదశి’ అన్నారు.

ధనానికి అధిదేవత ‘శ్రీమహాలక్ష్మి.
ధనానికి అధినాయకుడు ఉత్తర దిక్పాలకుడైన ‘కుబేరుడు’.

అందుకే., ఈ ధనత్రయోదశి నాడు శ్రీమహాలక్ష్మితో పాటు కుబేరుని కూడా ఆరాధిస్తారు. సాధారణంగా., ఈ లక్ష్మీ పూజను., సాయం సమయంలో ప్రదోష వేళలో వృషభ లగ్నంలో చేస్తారు. సూర్యాస్తమయం అయిన తర్వాత సుమారు 90 నిముషాలు ఈ ప్రదోషకాలం ఉంటుంది. ఆశ్వయుజ మాసంలో వృషభలగ్నం రాత్రి సుమారు 7 గంటల నుంచి 9 గంటల వరకూ ఉంటుంది. . కనుక ఈ సమయంలో శ్రీమహాలక్ష్మి పూజను చేసుకుంటే చాలా మంచిది. కొన్ని ప్రాంతాలలో శ్రీమహాలక్ష్మి, కుబేరులతో పాటు ధన్వంతరిని కూడా పూజిస్తారు.

లక్ష్మీదేవి ఏ ఇంటిలో దీపాలు వెలుగుతున్నాయో, ఆ ఇంటిని అనుగ్రహించిందట


ఆశ్వయుజ కార్తీకములలో అత్యంత ప్రధానమైనది దీపము. దీపావళి అనగా దీపముల వరుస. దీపావళి అమావాస్యనాడు గంగ ఎక్కడున్నా మనం స్నానం చేస్తున్న నీటిలోనికి ఆవాహన అవుతుంది. ‘తైలే లక్ష్మీర్జలే గంగా దీపావళి తిథౌవసేత్! అలక్ష్మీ పరిహారార్ధం తైలాభ్యంగో విధీయతే!! దీపావళి నాడు గంగ నీటిని, లక్ష్మి నూనెను ఆవహిస్తుంది. అందుకే నూనె రాసుకొని స్నానం చేయాలి. ఎందుకంటే లక్ష్మీ స్పర్శవల్ల అలక్ష్మీ పోతుంది. గంగ స్నానం చేత పాపరాశి ధ్వంసం అవుతుంది. ఆరోజు తప్పకుండా దీపముల వరుస వెలిగించి వాటి కాంతిలో అలక్ష్మిని తొలగగొడతారు. అంతరమందు జీవుని యొక్క ఉన్నతినీ, బాహ్యమునందు అలక్ష్మిని పోగొట్టుకొంటున్నాము అని చెప్పడానికి పెద్ద చప్పుళ్ళు చేస్తూ వెలుతురుతో కూడిన వివిధరకములైన బాణా సంచా కాలుస్తాము. బాణసంచా కాల్చడానికి కారణం నరకాసురవధ అని కాదు…’అలక్ష్మీ పరిహారార్ధం’.

దీపావళి నాడు మహాలక్ష్మి విష్ణువుతో కలిసి విహారం చేయాలని కోరింది. అలా విహారం చేయటానికి బయలుదేరిన లక్ష్మీదేవి ఏ ఇంటిలో దీపాలు వెలుగుతున్నాయో, ఆ ఇంటిని అనుగ్రహించిందట మరి, ఇంకెం? మహాలక్ష్మి అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు అప్పటి నుంచి దీపావళి సాయంత్రం దీపాలు వెలిగించటం ప్రారంభించారు. లక్ష్మీదేవి తనవాహనమైన గుడ్ల గూబనెక్కి సూర్యా స్తమయసమయం, అనగా సాయం సంధ్య లేక ప్రదోషళ వేళ నుండి అర్థ రాత్రి వరకు సంచారం చేసి దీపాలు వెలుగుతున్న ఇంట ప్రవేశించి అనుగ్రహిస్తుందని విష్ణుపురాణంలో ఉంది.

‘దీపం పరబ్రహ్మ స్వరూపమే కాదు సమస్తమైన చీకట్లను పోగొడుతుంది. దాని వల్లనే అన్నింటినీ సాధించవచ్చు అట్టి సంధ్యా దీపమా నీకు నమస్కారము”

”సమస్తమైన చీకట్లు అంటే భౌతికమైన చీకటి అనగా పగలు వెళ్ళిరాత్రి వచ్చినప్పుడంటే చీకటి ఒక్కటి కాదు అజ్ఞానము, పాపము, శోకము, మొదలైన సమస్తమైన జీవకోటికి హాని కలిగించే, ప్రగతి నిరోధకమైన అంశాలు. వాటినన్నింటినీ పోగొట్టేది దీప ప్రజ్జ్వలనంతో. మామూలు చీకట్లనే కాదు, అజ్ఞానం, దు:ఖం, శోకం, అలసత, రోగము, మాంద్యము, మృత్యువు మొదలైన వానినన్నింటిని పారద్రోలవచ్చును. అందుకు సహకరించేది సంధ్యాదీపం. పగలు భగవంతుడిచ్చిన ‘వెలుగు’ (సూర్యుడు) తన సహస్ర కరాలతో అందరికీ వెలుగును పంచుతాడు, చీకట్లు పోగొట్టి కాని, ఆయన మరుగైనప్పుడు మానవుని శ్రేయమెట్లా అందుకోసం దయా మయుడైన కర్మసాక్షి తన తేజమును అగ్నియందుంచాడట.

దీపాంతే నిహితం తేజస్సని త్రాణహుశన: ”ఆ అగ్నిదేవుని మన ఇంటి యందలి దీపమునందు ఆవాహన చేసినట్లయితే, ముల్లోకముల యందలి చీకట్లను పారద్రోలవచ్చట! ఎంతటి ఆశ! ఎంతటి హృద్యమైన భావన!! ఎంతటి మహోన్నత ఆశయం!!!

సాజ్యం, త్రివర్తి సంయుక్తం, వహ్నినా యోజితం మయ
గృహాణ మంగళం దీపం, త్రైలోక్యతి మిరాపహమ్‌

ఇంతటి మహదాశయంతో, సద్భావనతో, సదుద్ధేశంతో, వెలిగించే దీపం లక్ష్మికి ప్రతిరూపం అవటం, దానిని చూసి లక్ష్మీదేవి అనుగ్రహించటం సమంజసమే. దీపాలని చూసి లక్ష్మి అనుగ్రహించటానికి కారణం మరొకటి కూడా, చాతుర్యాస్మ దీక్ష పాటించే నాల్గునెలలు శ్రీ మహావిష్ణువు నిదురించే సమయంగా చెపుతారు. చతుర్మాస్యం పూర్తి అయి శ్రీమహావిష్ణువు నిద్ర మేల్కొనే రోజుగా దీపావళిని చెపుతారు. ఆయన నిద్రలేవగానే కన్నులకు వెలుగు కనిపించాలి కనక దీపాలు వెలిగించాలట. దీపావళి మేల్కొనటానికి ముందు సమయం. దానికి ప్రతీకగా తెల్లవారు జామునే లేచి తులసమ్మ దగ్గర దీపం పెట్టటం అనే సంప్రదాయం ఏర్పడింది. దీనికీ ఒక పద్ధతుంది. తులసి పూజ అయినాక కృత్తిక నక్షత్రదర్శనం చేయాలంటారు. ఈనెల అంతా కృత్తికల పేరు గలది కదా! ఆ వివరాలు ఉపొద్ఘాతంలో చెప్పుకున్నాం. తులసి పూజ కార్తీక దామోదరునికి చేస్తారు. అంటే కార్తీక మాసాధిపతి అయిన విష్ణుమూర్తికి అన్నమాట. తెల్లవారుజామున దామోదరుని, పగలు శివుణ్ణి, సాయంత్రం లక్ష్మిని ఆరాధించాలి.

పితృదేవతలకు మార్గం చూపించడానికి ఇంట్లోకి వెళ్లి కాళ్ళూ చేతులూ కళ్ళూ కడుక్కొని ఆచమనం చేసి లక్ష్మీ పూజ చేస్తారు. తరువాత దీపముల వరుసలు పెడతారు. ఆకాలమందు అమ్మవారు ఉత్తరేణి చెట్టు వ్రేళ్ళయందు ప్రవేశిస్తుంది. ఈరోజు మట్టితో కూడుకున్న ఉత్తరేణి తీసుకొని స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పి తలమీదనుంచి నీళ్ళు పోసుకుంటూ ఆ ఉత్తరేణి చెట్టు యొక్క మట్టి మీద పడేట్లుగా తిప్పుకోవాలి.

 

 

 

 

నరక చతుర్దశి యమునికి ఎంతో ఇష్టమైన రోజు.


ఈ రోజు సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంటుకొని, అభ్యంగన స్నానం చేయాలి.

ప్రత్యేకించి ఆ వేళ నువ్వులనూనెలో లక్ష్మి, మంచినీటిలో గంగాదేవి కొలువై ఉంటారని శాస్త్రాలు వివరిస్తున్నవి. యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు తినడంతోపాటుసూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు.

ఈ చతుర్దశి రోజు సాయంత్రం ఎవరైతే దీపాలు వెలిగించి దానధర్మాలు చేస్తారో వారి పితృదేవతలకు నరకబాధ తొలగుతుందని భారతీయుల నమ్మకం. ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాటి రాత్రి రెండో జాములో నరకాసుర సంహారం జరిగింది. కనుక మూడో జాములో అభ్యంగస్నానం చేసినవారికి నరక భయం తీరుతుందని శాస్త్ర వచనం. ఈ చతుర్దశినాడు నూనెలో లక్ష్మీదేవి, నీళ్లలో గంగాదేవి అధివసించి ఉంటారంటారు. కనుక నరక చతుర్దశినాడు సూర్యోదయానికి ముందుగానే తలస్నానం చేస్తే మంచిది. సాయంకాలం ఇంట్లోని దేవుడి మందిరంలోనూ, ఏదైనా దేవాలయంలోనూ దీపారాధన చేయటం శుభప్రదం.

చతుర్దశ్యాం తు యే దీపాన్‌
నరకాయ దదాతి చ|
తేషాం పితృగణా స్సర్వే
నరకాత్‌ స్వర్గ మాప్నుయుః ||

చతుర్దశినాడు దీపదానం చేస్తే పితృదేవతలందరికీ స్వర్గనివాసం కలుగుతుందని విశ్వసిస్తారు. ఇదేరోజున సాయం సమయంలో నూనెతో తడిపిన తయారుచేసిన కాగడాలను చేతబట్టుకొని తిరిగినట్లయితే పితృదేవతలకు దారి చూపినట్లవుతుందనీ పలువురు నమ్ముతారు.

ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశి అంటాం. ఈ నరక చతుర్దశి తర్వాతి రోజే దీపావళి. ఒక రాక్షసుణ్ణి మరణాన్ని ఆనందంగా పండుగ చేసుకోవడం – నరక చతుర్దశి విశిష్టత.నరకాసుర వధ – చతుర్దశి నాడు (ఆశ్వయుజ బహుళం) ఆకాశంలో రాసులస్తితిని సూచించేది. తులారాశి తూర్పు క్షితిజం మీద ఉదయిస్తుంటే పడమటి క్షితిజం మీద మేషరాశి అస్తమిస్తుంటుంది. నరకుడు భూదేవి కొడుకు. మేషం సహజంగా మంచిదే అయినా మూర్ఖత్వమూర్తి. కనుక అతని పాలన అంధకారమయం! ఆ రోజు మేష రాశి సూర్యాస్తమయ సమయంలో ఉదయిస్తుంది. అది అస్తమించే వరకు చీకటే! మేష రాశి అస్తమించే వేళకు తులారాశి తూర్పు దిక్కున క్షితిజం మీదికి వస్తుంది. స్వాతి నక్షత్రానికి వాయువు దేవత. దాన్ని అధిస్టించి నరకుని మీదికి బయలుదేరిన కృష్ణుడు – సూర్యుడు, సత్యభామ-చంద్రుడు. నరకుడు చనిపోగానే ఆకాశపు అంచులపై దీపచ్చాయాల్లో కన్యారాశి (కన్యల గుంపు) నరకుని బంధాలనుంచి విడివడి, తమను విడిపించిన సూర్యున్ని – కృష్ణున్ని నాయకునిగా చేసుకునింది. ఇలాంటి స్థితి నరక చతుర్దశి, దీపావళి రోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో లేదు. నరక భావాలు అంటే దుర్భావాలను, కృష్ణభక్తి అనే చక్రాయుధంతో ఖండింప చేసి, జీవుడు భవద్దర్శన ప్రాప్తితో ఆనందించాలి అనేది ఇందులోని అంతరార్ధం. నరాకాసురవధ స్త్రీ స్వాతంత్ర్యానికి నిదర్శనం.

నరక చతుర్దశి ఆచరణ వెనక ఉన్న గాథల్లో నరకాసురుడి గాథ ప్రధానమైంది. హిరణ్యాక్షుడు లోకానికి ఉపద్రవంగా భూదేవిని చుట్టచుట్టి సముద్రంలో ముంచినప్పుడు విష్ణుమూర్తి వరాహావతారమెత్తి, ఆ రాక్షసుని సంహరించి భూదేవిని ఉద్ధరించాడు. ఆ సందర్భంగా భూదేవికి విష్ణుమూర్తి వరప్రసాదం వలన భీముడనే పుత్రుడు జన్మించాడు. అతనే దుర్మార్గుడైన నరకాసురునిగా పేరొందాడు. నరకుడు ప్రాగ్జోతిషపురం రాజధానిగా కాపరూప రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. భూమాత తన కుమారుని రాక్షసత్వానికి దూరంగానే పెంచింది. దురదృష్టవశాత్తు నరకుడు అసుర ప్రభావంలోపడి ఘోరతపస్సు చేసి అనేక వరాలు పొందాడు. తనకు తన తల్లి చేతిలో తప్ప మరణం సంభవించకూడదని కూడా వరం పొందాడు. స్వయాన తన తల్లే తనను చంపదని అతని ధీమా. ఆ వరగర్వంతో అతను కావించిన దుష్కార్యాలు పరాకాష్టకు చేరి దేవతలను తీవ్ర అశాంతికి గురి చేసాయి. విష్ణుద్వేషియై దేవతలను హింసించసాగాడు. దేవమాత అదితి కర్ణ్భారణాలను, వరుణ ఛత్రాన్ని అపహరిస్తే శ్రీకృష్ణుడు ఇతనిని ద్వందయుద్ధంలో ఓడించి, వాటిని తిరిగి అదితికి అందజేసాడు.

మరొకప్పుడు మదపుటేనుగు రూపంలో విశ్వకర్మ పుత్రికను చెరపట్టాడు. వీరూవారను విచక్షణ లేకుండా గంధర్వ, దేవ, మానవ కన్యలను బలవంతంగా అపహరించి, తన అంతఃపుర పంజరంలో బంధించడం ఇదనికొక వ్యసనం. ఇతని దౌర్జన్యాలు అంతటితో ఆగక చివరకు ఇంద్రునిపైకి కూడా దండెత్తి ఆయన అధికార ముద్రను అపహరించడంతో ఈ అసుర ప్రముఖుని దురంతం పరాకాష్టనందుకుంది.ఇంద్రుడు ఆపదరక్షకుడైన శ్రీకృష్ణుని శరణువేడగా గోపాలుడు నరుకునిపై దండెత్తాడు. అయితే నరకాసురుని విషపు బాణానికి శ్రీకృష్ణుడు ఒక క్షణంపాటు నిశ్చేష్టుడయ్యాడు. అది గమనించి ఆయనతో కూడానే ఉన్న ఆయన సతీమణి సత్యభామ ఉగ్రురాలై భయంకరమైన తన బాణాన్ని ప్రయోగించి సంహరించింది. ఆశ్వయుజ బహుళ చతుర్దశినాడు లోక కంటకుడైన నరకుని మరణం సంభవించింది. యాదృచ్ఛికంగా నరకాసుని మరణం సత్యభామ రూపంలో తన తల్లి భూదేవి చేతిలోనే సంభవించింది.

తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్థశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు. నరకుని చెరనుండి సాధుజనులు, పదహారువేలమంది రాజకన్యలు విడిపించబడ్డారు, ధ్రర్మం సుప్రతిష్టమైంది. నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమవాస్య కావడంతో, చీకటిని పారద్రోలుతూ ప్రజల దీపాలతో తోరణాలు వెలిగించి, బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది.

దీపావళి


దీపావళి అంటే ‘దీపాల వరుస’ అని అర్థం. దీప మాలికలతో లక్ష్మీదేవికి నీరాజనమిచ్చే రోజు ఇది. అందుకే, దీనికి ‘దీపావళి’ అన్న పేరు వచ్చింది. ఒక్క మన దగ్గరే కాదు, దేశ విదేశాల్లోని భారతీయులంతా అత్యంత ఉత్సాహంగా, ఉల్లాసంగా జరుపుకునే పండగ ఇది.

హిందువుల పండుగలలో అతిముఖ్యమైనది ” దీపావళి” . సమగ్ర భరతఖండంలో హిందువులే కాకుండా బౌద్ధులు, జైనులు కూడా ఈ పండుగను జరుపుకుంటారు. ” నరకాసుర సమ్హారము ” మన అందరకూ సుపరిచితమైన విషియమే. అయితే ఈ పండుగను జర్పుకొనే విధానంలో ప్రాంతీయ బేధాలున్నాయి. మనం అమావాస్య ఒక్కరోజే పండుగ చేసుకుంటాం. ఉత్తరాదిన 5 రోజుల పండుగ ఇది. తమిళనాట నరకచతుర్దశి నాడు సూర్యోదయానికి ముందు జరుపుకుంటారు.

నరక చతుర్దశి

ఈ రోజున తెల్లవారకముందే నువ్వులనూనే తలపై వేసుకుని ” ఉత్తరేణి” కొమ్మను నెత్తి మీద ఉంచుకుని తలంటుకోవాలి. అలా తలంటుకునేటప్పుడు

శీతలోష్ణ సమాయుక్త సకంటకదళాన్విత హరపాప మపామార్గ భ్రామ్యమాణః పునః పునః అని చెప్పుకోవాలి.

స్నానాంతరం నల్లనువ్వులతో “యమాయ తర్పయామి తర్పయామి తర్పయామి ” అంటూ యమతర్పణం విడవాలి. నరకాసురుడు మరణించిన సమయం అది.

ఆపై

యమాయ ధర్మరాజాయ మృత్యువే చాంతకాయచ!
వైవస్వతాయ కాలాయ సర్వభూత క్షయాయచ!!
ఔదుంబరాయ ధర్మాయ నీలాయ పరమేష్టినే!
మహోదరాయ చిత్రాయ చిత్రగుప్తాయతే నమః!! అని చెప్పుకోవాలి.

ఇల్లంతా కడిగి ముగ్గులు పెట్టుకోవాలి. ఆ రోజు మినపాకులతోకూర వండుకు తినాలి. వీలుకాకపోతే మినపగారెలైనా సరే. నరకచతుర్దశినే ప్రేతచతుర్దశి అని కూడా అంటారు.

వెలుగు జ్ఞానానికి గుర్తు. సంతోషానికి ప్రతీక. చీకటిని దూరం చేసే దీపం మనిషి వివేకానికి సంకేతం. భారతీయ దివ్య ఋషులు, దార్శనిక శక్తి కల్గిన మహర్షులు మేధోమధనంలో మానవాళి అభివృద్ధి కోసం శాస్త్రాలు రచించి, నియమాలు వివరించిండ్రు. అనేక వేల సంవత్సరాల నుండి మన పూర్వీకులు ఆచరిస్తూ, అనుసరిస్తూ, అభిమానిస్త్తూ వచ్చిందే సంప్రదాయం.

ప్రతి ఆచారం వెనుక ఒక అంతరార్థం, ఒక ప్రయోజనం, ఒక పరమార్థం వుంది. అట్లే ప్రతి ఏడూ మనం వేడుకగా జరుపుకునే దీపావళి పండగకు కూడా మన పూర్వీకులు కొన్ని మూలాలను వివరించిండ్రు. అవే మనందరికీ వెలుగు దివిటీలు అవుతున్నాయి.

దీపావళి అయిదు రోజుల పండగ. తొలిరోజు ధన త్రయోదశి లేదా ధన్వంతరి జయంతి. రెండోరోజు నరక చతుర్దశి. మూడవ రోజే ఘనమైన దీపావళి. ఇక నాలుగో రోజు బలి పాడ్యమి. చివరి రోజును యమ ద్వితీయగా జరుపుకుంటాం.

నరక చతుర్దశి’ ప్రత్యేకతలు
ఆశ్వయుజ బహుళ చతుర్దశిని ‘నరక చతుర్దశి’ అంటరు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై లోక కంటకుడైన నరకాసురుని సంహరించాడు. సర్వలోకాలకు, దేవతలకు ఆనందాన్ని కలిగించిన ఆ రోజును జనమంతా ‘నరక చతుర్దశి’గా జరుపుకోసాగారు.

మూలకథ-1:
వరాహ రూపంలో ఉన్న విష్ణుమూర్తివల్ల భూదేవికి నరకుడు పుడతాడు. యోగనిద్ర నుండి లేచిన విష్ణుమూర్తిని భూదేవి కామించిన ఫలితం ఇది. నరకుని రాజధాని ప్రాగ్జోతిషపురం. ఇతడు దేవమాతయైన అదితి కుండలాలను, వరుణదేవుని ఛత్రాన్ని, దేవతల మణి పర్వతాన్ని, 16 వేల మంది గోపికలను చెరపట్టి అపహరించాడు. దీంతో గత్యంతరం లేని దేవేంవూదుడు శ్రీ కృష్ణునికి నరకాసురుని అత్యాచారాలు విన్నవిస్తాడు.

శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై నరకాసురుని పైకి యుద్ధానికి వెళ్ళి, అతనిని సంహరించాడు. 16 వేల మంది గోపికలకు దాస్య విమోచనం కలిగించిండు. దేవేంవూదుని నగరమైన అమరావతికి వెళ్ళి అదితికి కుండలాలను సమర్పిస్తాడు. సత్యభామా సమేతంగా ఆమె ఆశీస్సులు అందుకుంటడు.
లోకకంటకుడైన నరకాసురుడు మరణించిన ఆ రోజు శ్రీకృష్ణుని విజయానికి గుర్తుగా భూలోకంలోని ప్రజలు సంతోషంగా జరుపుకునే పండగగా ‘నరక చతుర్దశి’ స్థిరపడింది.

మూలకథ-2:
ఈ చతుర్దశి యమునికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంటుకొని, అభ్యంగన స్నానం చేయాలి. ప్రత్యేకించి ఆ వేళ నువ్వులనూనెలో లక్ష్మి, మంచినీటిలో గంగాదేవి కొలువై ఉంటారని శాస్త్రాలు వివరిస్తున్నవి. యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు.
అభ్యంగన స్నానానంతరం దక్షణాభి ముఖంగా ‘యమాయమంః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు తినడంతోపాటు సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తరు. ఈ చతుర్దశి రోజు సాయంత్రం ఎవరైతే దీపాలు వెలిగించి దానధర్మాలు చేస్తరో వారి పితృదేవతలకు నరకబాధ తొలగుతుందని భారతీయుల నమ్మకం.

దీపావళి: (ధనలక్ష్మి పూజ, కేదారేశ్వర వ్రతం)
నరక చతుర్దశి తర్వాతి రోజు దీపావళి అమావాస్య. ఇది ఆశ్వయుజ మాసపు చిట్టచివరి రోజు. ఈ రోజు తప్పకుండా లక్ష్మీదేవిని పూజించాలి. ఎందుకంటే చీకటిపై వెలుతురు సాధించిన విజయానికి గుర్తుగా మనం దీపావళిని జరుపుకుంటున్నం. కొన్ని ప్రాంతాలలో పగలంతా ఉపవాసముండి, సాయంత్రం లక్ష్మీదేవిని పూజించే ఆచారం వుంది.

దీపావళి రోజు సాయంత్రం కొత్త బట్టలు ధరించి తప్పకుండా ధనలక్ష్మిని పూజించాలి. ఈ రోజు మహాలక్ష్మిదేవి భూలోకానికి వస్తుందంటారు. ప్రతీ ఇంటికి వెళ్తూ, శుభ్రంగా అలికి ముగ్గులు వేసిన ఇండ్ల ముందు తన కళను వదిలి వెళ్తుందని ప్రజల నమ్మకం. ఉత్తర భారత దేశంలో ధనలక్ష్మీ పూజ ఈ అశ్వయుజ అమావాస్య చాలా ప్రశస్తమయిందిగా భావిస్తరు.

ఈరోజు వ్యాపారులు లాభనష్టాలను పరిశీలిస్తరు. లక్ష్మీపూజ కోసం తప్పకుండా వారి వారి శక్తి మేరకు బంగారం, వెండి కొంటరు. తెలంగాణ ప్రాంతంలో వ్యాపారులు ఆనాటి సాయంత్రం ధనలక్ష్మిని భక్తితో పూజించి, తమ వ్యాపారం దినదిన ప్రవర్దమానం కావాలని కోరుకుంటరు.

లక్ష్మీ పూజానంతరం కుటుంబ సభ్యులందరూ మధురమైన తీపి పదార్ధాలను ఇతరులకు పంచి పెడతారు. టపాకాయలు కాలుస్తరు.

ముఖ్యంగా పల్లె ప్రాంతాలలో దీపావళిని ‘దివిలి పండగ’ అంటరు. పసుల పిల్లలు గోగు (పుట్టి) కట్టెలతో కట్టలను కట్టి రాత్రి సమయంలో వెలిగించి తిప్పుతరు. దీనివల్ల ఆపదలన్నీ తొలగిపోయి, సుఖ సంతోషాలు కలుగుతవని వారి నమ్మకం.

తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో ఈ రోజు నుండే కేదారేశ్వర వ్రతం ప్రారంభిస్తారు. మంగళ ప్రదాయిని అయిన ఈ గౌరీదేవి వ్రతం చేస్తే సమస్త శుభాలు కలుగుతాయని ప్రజల విశ్వాసం. అయితే, ఈ గౌరీ నోములను కొందరు కార్తీకమాసంలో దశమి నోములుగానూ నోముకుంటరు.

అజ్ఞానమనే అమావాస్య చీకట్లను పారవూదోలి విజ్ఞానమనే వెలుగులను నింపి, జగత్తును తేజోమయం చేసే పండగ దీపావళి. దరివూదానికి అధిదేవతయైన జేష్ఠ్యాదేవిని పారదోలి సంపదల తల్లియైన లక్ష్మీదేవికి స్వాగతం పలికే పండగగానూ దీనిని భావించాలి.

లక్ష్మి దేవి ఎక్కడ వుంటుంది


లక్ష్మి దేవి ఎక్కడ వుంటుంది అని నారదుడు శ్రీ మహావిష్ణువుని అడుగగా అప్పుడు
శ్రీ మహావిష్ణువు లక్ష్మి దేవి ఎక్కడెక్కడ ఉంటుందో చెప్పారు అవి ఏమిటంటే

“అఖిల విశ్వం సమస్త ప్రాణులు నా అదీనంలో ఉంటే , నేను నా భక్తుల అదీనంలో ఉంటాను . మీరు నా భక్తులు, కనుక మీకు పరమైస్వర్యాన్ని అందించే ఆచలలక్ష్మిని ప్రసాదిస్తాను. అయితే దానికి ముందుగా నేను చెప్పబోయే మాటలు వినండి – అంటూ లక్ష్మి ఎవరెవరి వద్ద ఉంటుందో, ఎవరివద్దవుండదో , వివరించాడు. లక్ష్మిని కోరుకునే వారందరూ తప్పకుండా దృష్టిలో ఉంచుకోవలసిన విషయాలివి.

  1. భగవద్భాక్తులపై కోపగించే వారి గృహంలో లక్ష్మిదేవే కాదు.శ్రీ హరి కుడా ఉండదు.
  2. శంఖద్వని వినిపించని చోటా.
  3. తులసిని పూజించని చోట.
  4. శంఖరుని అర్చించని చోట.
  5. బ్రహ్మవేత్తలకు , అతిధులకు భోజన సత్కారాలు జరగని చోట. లక్ష్మి దేవి నివసించదు.
  6. ఇల్లు కళ కళ లాడుతూ ఉండని చోట.
  7. ఇల్లాలు ఎల్లవేళలా కంటతడి పెట్టిన చోట.
  8. విష్ణువును ఆరాధించకుండ.ఏకాదశి మరియు జన్మాష్టమి రోజులలో భోజనం చేసేవారి ఇంట లక్ష్మి నివసించదు.
  9. హృదయములో పవిత్రత లోపించిన, ఇతరులను హింసింస్తున్న. ఉత్తములను నిందిస్తున్న లక్ష్మి ఆ ఇంటిలోనుంచి పారిపోతుంది.
    అనవసరం గా గడ్డిపరకలను తెంచిన.
  10. చెట్లను కులగొట్టినా లక్ష్మి కటాక్షం లోపిస్తుంది.
  11. నిరాసావాధులను, సుర్యోదయ సమయంలో భోజనం చేసే వాని, తడి పాదాలతో నిద్రపోయేవారిని , వివస్త్రులై నిద్రపోయేవారిని, తలక్రిందులుగా మాట్లాడేవారిని, తమ తలకు రాసుకున్న నూనెను ఇతరులకు అంటించే వారిని కుడా లక్ష్మి వరించదు.
  12. శ్రీహరి దివ్యచరిత్ర, గుణగానం జరిగే చోట, సాలగ్రామం, తులసి, శంఖద్వని ఉన్నచోట , లక్ష్మి విరజిల్లుతుంది.
  13. ఇలా శ్రీ హరి లక్ష్మీకటాక్షం ఎలా కలుగుతుందో, ఎలాకలగాదో చెప్పారు.
    సంపద మన ఆదీనం లో ఉండాలి కాని, మనం సంపద ఆదీనం లో ఉండకూడదు . ఏకాస్త గర్వించిన, అహంకరము చూపిన ఐశ్వర్యం జారిపోతుంది. సద్వినియోగమే సంపద పరమార్ధము. అది విస్మరించినా లక్ష్మి వీడిపోతుంది. ఇదే శ్రీ మహాలక్ష్మి కటాక్ష రహస్యం.

స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవాలయం::: మేళ్ళచెరువు,


కాకతీయుల కాలం నాటి ఈ చారిత్రక శివాలయం ప్రత్యేకమైనది ఎందుకంటే ఇక్కడి శివలింగం(1.83 మీటర్ల ఎత్తు 0.34 మీ చుట్టు కొలత కలిగి ప్రతి సంవత్సరం ఎత్తు పెరుగుతూ ఉంటుంది… నిత్యం స్వయం అభిషేకం జరుగుతుంటుంది….

శివలింగం పెరిగే ఎత్తు ఒక ఎత్తయితే ప్రతి అడుగు ఎత్తు తర్వాత ఒక వలయం(చిత్రం రెండు, ఆరు) ఏర్పడుతూ ఉంటుంది.. ఆవిధంగా చూస్తే మనకు కొన్ని సంవత్సరాల తర్వాత వలయాల సంఖ్యలో పెరుగుదల మనకు స్పష్టంగా కనపడుతుంది… మొదట్లో కేవలం మూడు నామములు(చిత్రం నాలుగు) పెట్టే స్థలమే ఉండేదట.. ప్రస్తుతం ఆరు నామములు (చిత్రం ఐదు)పెట్టేంత స్థలం ఏర్పడిందని ఆలయ అర్చకులు.. పెద్దవారు చెపుతుంటారు…

ఇంకొక విచిత్రమేమిటంటే ఈ శివలింగం పై భాగంలో చిన్న ఖాళీ (చిత్రం మూడు)ప్రదేశముంది.. ఇక్కడ ఎప్పుడూ నీరు ఊరుతూ (చిత్రం తొమ్మిది)ఉంటుంది.. ఈ నీరు విగ్రహంపై అభిషేకంలా ఎప్పుడూ (చిత్రం తొమ్మిది)ఉబుకుతుంది… అంటే శివుని ఝటాఝూటంలోని గంగమ్మ వారిలా… అందుకే ఇది స్వయంఅభిషేక లింగంగా చెప్పుకోవచ్చు… ఇది ఈ క్షేత్రంలో చాలా ప్రత్యేకం.. ఈ నీరు ఎంత తీసివేసినా తిరిగి తిరిగి ఊరుతూనే ఉంటుంది… ఇక్కడ శాస్త్రీయమైన ఏ ఆధారాలు లేవు… కానీ ఇది ఒక అద్భుతం… శివుని ఝటాఝూటంలో గంగా దేవి లాగా శివుని అభిషేకం చేయటం అద్భుతమే కదా… మన భారతదేశంలో కేవలం వారణాసి లో మాత్రమే ఇలా ఉందట.. అందుకే దీనిని దక్షిణ కాశీ అని కూడా ఇక్కడ పిలుస్తారు…


కాకతీయుల కాలంలో ఒక ఆవు ప్రతిరోజూ వచ్చి ఈ శివలింగానికి క్షీరాభిషేకం చేసేదట… ఆ యాదవ కాపరి ఆ రాయిని శివలింగంఅని తెలియక పదకుండు ముక్కలుగా చేసి వేర్వేరు ప్రదేశాలలో పారవేస్తాడట… కానీ తిరిగి రెండవ రోజు చూస్తే మరల అక్కడ ఈ లింగం ప్రత్యక్షమై కనిపించిందట… అతనికి ఏమీ అర్థంకాక రాజుగారికి చెపితే ఆయన దీనిని శివలింగం గా గుర్తించి ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం వేయి సంవత్సరాల చరిత్ర ఉన్నదిగా చెపుతారు…

ఇక్కడ శివరాత్రి మహోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి.. శివ కళ్యాణమును లక్షదీపారాధనలను చాలా కన్నుల పండువగా నిర్వహిస్తారు…

కాకతీయుల కాలమునకు సంబంధించిన ఈ ఆలయమునకు ఎందుకో ఎక్కువగా ప్రాచుర్యం లభించలేదు…

ఈ ఆలయం కోదాడ దగ్గరలో ఉంది… జాతీయరహదారి (నుండి కేవలం పది కి.మీ. లోపులో ఇక్కడకు చేరుకోవచ్చు.. ఇక్కడ చాలా సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి… దీనివలన కోదాడ ఒక రకంగా సిమెంట్ టౌన్ గా మారింది….. మన ఆంధ్రప్రదేశ్/తెలంగాణా లో సుప్రసిద్ధ సిమెంట్ బ్రాండ్ ల ఫ్యాక్టరీ లన్నీ ఇక్కడికి సమీపంలో ఉన్నాయి…

1653420_372511316240008_263600279916460558_n

ఈ పద్యాలను మననం చేసుకుంటూ ఉంటే సర్పభాయాలు ఉండవని పెద్దలు చెప్పిన మాట.


ఉదంకుడు పైల మహర్షి శిష్యుడు. గురువుగారి వద్ద విద్యాసముపార్జన పూర్తి చేసాడు. గురుదక్షిణ సమర్పించదలచాడు. పౌష్య మహారాజుగారి పత్నియొక్క కుండలాలు గురుదక్షిణగా కావాలని పైలుడు కోరాడు. ఆ కుండలాలను సంపాదించి వస్తున్న ఉదంకుడి నుండి తక్షకుడనే నాగరాజు వాటిని అపహరించాడు. వాటి నిమిత్తం ఉదంకుడు నాగలోకానికి వెళ్ళాడు. నాగరాజులను ప్రసన్నం చేసుకోవడానికి చేసిన నాగాస్తుతి ఇది. ఇవి నన్నయ్యగారి అమోఘమైన పద్యాలలో అనవద్యమైనవి. ఈ పద్యాలను మననం చేసుకుంటూ ఉంటే సర్పభాయాలు ఉండవని పెద్దలు చెప్పిన మాట.
బహువన పాదపాబ్ధికులపర్వత పూర్ణ సరస్సరస్వతీ
సహిత మహామహీధర మజస్ర సహస్ర ఫణాళి దాల్చిదు
స్సహతర మూర్తికిన్ జలధిశాయికి బాయక శయ్యయైన య
య్యహిపతి దుష్రుజలతాంతకుడనంతుడు మాకు బ్రసన్నుడయ్యెడున్


అనంతుడు అహిపతి. అంటే నాగరాజు. ఆయన మన పాపాలను పోగొట్టే మహితాత్ముడు. కనుక దుష్క్రుతాంతకుడు. ఆయన జలధిశాయికి శయ్య అంటే సముద్రంపై శయనించిన శ్రీమహావిష్ణువు పాన్పు విష్ణుమూర్తి అంటే విశ్వరూపుడు. కనుక విష్ణువు దుస్సహమూర్తి. అంటే భరించరానంత మూర్తి. ఆయనను మోస్తున్నవాడు అసామాన్యుడైన అహిపతి అనంతుడు. ఎట్లా మోయగలుగుతున్నాడంటే ఆయన బలం అంతాయింత కాదు. ఆయన ఈ భూమండలాన్ని తన పడగల మీద మోస్తున్నాడు. అవి అజస్ర సహస్ర ఫణములు. అంటే అంతులేని వేయి పడగలు. అటువంటి పడగలపై అనేక వనాలు, సముద్రాలు, కుల పర్వతాలు, మహానదీ నదాలతో కూడిన మహా మహీమండలాన్ని మోస్తున్నవాడు. అటువంటి మహానుభావుడైన అనంతుడు ప్రసన్నుడు కావాలని ఉదంకుడు స్తుతించాడు.

NagaRAju_god

విశాలమైన భూమండలం అని చెప్పే సమాసం – “బహువన….మహా మహీధరం”. ఆ సమాసంలోనే రెండవ ప్రయోజనం సాధించాడు మహాకవి నన్నయ్యగారు. అంత విశాలమైన తన పడగలమీద మోస్తున్నాడు అనంతుడు. ఇటు పడగల వైశాల్యాన్ని కూడా ఈ సమాసంలోనే సూచించారు. అనంతుడు అఖండ బలపరాక్రమాలను సూచించారు మరొకవైపు. అందుకే ఆయన తెలుగున గురు పద్య విద్యకు ఆద్యుడు. శబ్దశాసనుడు. హ, స – వర్ణాలను పునః పునః ప్రయోగించి నాగజాతి బుసకొట్టే లక్షణాన్ని శిల్ప సమన్వితంగా ప్రదర్శించాడు మహాకవి.