​మానవ జన్మ దుర్లభం


మానవ జన్మ దుర్లభం
సమస్త ప్రాణుల్లోకి మానవజన్మ ఉత్తమైనది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది లభించడం చాలా కష్టం అని ఉపనిషత్తులు ఉద్ఘోషిస్తున్నాయి. ఒక్కసారి మానవ జన్మలోకి ప్రవేశించాడు అంటే, ఎంతెంతో పుణ్యం, ఎన్నో జన్మల సుకృతం, భగవంతుని యొక్క దయ చేరితే మానవ జన్మ లభిస్తుంది. ఏమిటి మానవ జన్మ యొక్క గొప్పతనం అంటే మళ్ళీ ఈ దుఃఖ భూయిష్టమైన జన్మలలలోకి రాకుండా నేరుగా ఈ మానవ జన్మ నుండి తరించే అవకాశం ఉంది. మిగతా జన్మలలోకి వెళ్తే అట్లా తరించే అవకాశంలేదు, క్రమంగా ఒక్కో మెట్టు ఎక్కి వచ్చినట్లు ఒక్కో జన్మ మారుతూ రావల్సిందే. మిగతా జీవులు ఏకాస్తనైనా తరించాలి అంటే అది మానవుడి అనుగ్రహం వల్ల తప్ప వాటంతట అవి తరించలేవు, ఏమో భగవంతుడు నేరుగా తరింపజేస్తే అది వేరే విషయం.
పశుః మనిష్యః పక్షీవా ఏష వైష్ణవ సంశ్రయాః |

తేనైవ తేప్రయాస్యంతి తద్విష్ణోపరమంపదం ||
ఎప్పుడైతే ఒక వైష్ణవుడిని ఆశ్రయించినప్పుడు, వైష్ణవుడి అభిమానాన్ని పొందినప్పుడు పశువులు కానీ, పక్షులు కానీ, మనుషులు కానీ విష్ణు లోకమైన పరమపదానికి వెళ్ళగలవు. మానవ జన్మకు ఉత్తమమైన యోగ్యత ఉంది. మననం, ఆ మననానికి తగ్గ కర్మ చేయగలిగేవాడు మానవుడు అంటే. మానవుడు తన స్థితిని, గతిని గురించి మననం చేయగలడు, ఆ చేసినదాన్ని కార్య రూపంలోకి తేగలడు. మిగతా జంతువులు కొంతవరకే ఆలోచన చేయగలుగుతాయి, కేవలం తన శరీరం, శరీర సంరక్షణ వరకు మాత్రమే ఆలోచన సాగుతుంది. శరీరం పెరుగుతూ వస్తుంది, తిరిగి క్షీణిస్తుంది, శరీరం మారుతుంది కానీ మార్పులేని నేను అనేది ఎప్పటికి మార్పుచెందక ఉన్నాను అని గుర్తించగలడు మానవుడు. ఈ పరిణితిని గుర్తించిన వాడిని మరొక్క అడుగు ముందుకు వెళ్ళమని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతాడు “తదాదేహాంతర ప్రాప్తిః ధీరః తత్ర నముహ్యతి” రెండో అధ్యాయంలో. వయసు పెరిగిన కొద్ది శరీరం యొక్క సామర్థ్యం మారుతోంది, ఈ శరీరం పోయి మరొకటి రావడం కూడా ఇట్లానే ఉంటుంది. ఒక చిన్న పిందగా ఉన్నది కాయగా మారుతుంది, ఆకాయ పండుగా అయి రాలి పోతుంది ఒకనాడు. మనం కూడా అట్లానే పక్వంచెంది బయటికి వెళ్ళాలి, ముందే రాలిపోకూడదు. అందుకే పక్వం చెందటానికి ఆలోచించాలి. అది ఆలోచించగలిగితే జరిగే మార్పుల్లో ఏడుపు రాదు. రాలిపోతుంది అంటే కూడా ఏడుపురాదు, వాడిని ధీరః అని అంటారు. ‘నముహ్యతి’ బుద్దిని అట్లా వాడుకో గలిగిన వాడు మోహంచెందాల్సిన పని లేదు. ఏడిచే పని వానికి రాదు. ఇదే భగవంతుడు చెప్పినది. మనం ఇక్కడ ఉండగా హాయిగా బ్రతికేట్టు చేద్దాం అనేది ఆయన సంకల్పం. అందుకే మనకోసం ఆయన ఇన్ని ఉపదేశాలు చేయడం, మనకే ఎందుకు చేయాలి అంటే గుర్తించగలిగే ప్రాణి మనిషి కనుక. మిగతా జంతువులు గుర్తించలేవు.
మానవ జన్మ ఎక్కువ కాలం ఉండదు. ఉన్న కాలాన్ని సక్రమంగా వాడుకోవాలి. “దుర్లభో మానుషోదేహః” శరీరం లభించడమే చాలా కష్టం, “దేహినాం క్షణ భంగురః” లభించినది ఒక క్షణమంత కూడా ఉండదు. “మిన్నిన్ నిలయిల మన్ను ఇఱాక్కెగళ్” అని చెబుతారు నమ్మాళ్వార్. ఇది మెరుపు కంటే కూడా ప్రమాదకరమైనది. మెరుపు ఎట్లా ఐతే పోయేదో, ఆ వెలుతురును పట్టించుకోం, అట్లానే శరీరం పోయేది అని తెలిసి కూడా దానికోసం ఎన్ని తప్పుడు పనులు చేస్తున్నారే! పోయేదే అయినా ఇది పోయేది అని అనుకోనివ్వటం లేదు. కేవలం శరీరంకోసం బ్రతుకుతున్నాం అంటే ఇది ఎంత ప్రమాదమైనదో గుర్తించాలి. తెలియని శత్రువువంటిది అని చెబుతాడు నమ్మాళ్వార్. మెరుపు పోతుందని తెలుసు మనం వాడుకోం, అందుకే ఆ మెరుపే నయం. ఇట్లాంటి స్థితిలో మనం ఎన్నో జన్మలలో ఒక సారు మనిషి అయినప్పుడు దైవాన్ని గురించి ఆలోచించి, ఆ జ్ఞానాన్ని ఇచ్చే మహానుభావులని విశ్వసించి వారికి తగినట్లు బ్రతికగలిగితే, అట్లాంటి జన్మ కోటికి ఒకటైనా ఉంటుందో లేదో అని చెప్పవచ్చు. “తత్రాపి దుర్లభం మన్యే వైకుంఠ ప్రియదర్శనం” మానవ జన్మలభించడమే గొప్ప అంటే, అట్లాంటి మానవ జన్మలో దైవాన్ని గుర్తించి బ్రతకడం, వైకుంఠ ప్రియులైన వారి దర్శనం లభించడం, వారి అభిమానం పొందటం ఎంత కష్టమో అనేది ఋషివాక్కు!! పరాశర మహర్షి వంటి వారికే అట్లా అనిపిస్తే ఇక మన గురించి ఆలోచించాలి. ఇవన్నీ మనిషికి చెప్పాల్సొచ్చింది, అది చెప్పడానికే రామావతారం.