మనకు వేదాలు ప్రమాణం.ఈ యుగ ప్రారంభంలో వ్యాసుడు వేదరాశిని నాలుగుగా విభజించి నలుగురు శిష్యులకు వాటి సంరక్షణకై ఈ నాలుగు భాగాలు ఇచ్చాడు. వేదంలో భాగాలు సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు. ఉపనిషత్తులను వేదం చివరచేర్చడం వలన అవి వేదాంతము అనిపిలువబడతాయి. ఈ ఉపనిషత్తులసారాన్ని 18 అధ్యాయాలలొ సుమారు 700 శ్లోకాలుగా మనకై ఇచ్చినవాడు శ్రీకృష్ణుడు. అర్జునుని వ్యాజంతో మనందరికీ బోధించిన గురువయ్యాడు. అందుకే భగవద్గీతను గీతోపనిషత్ అంటారు. వేదాలు అర్థంచేసుకోవడానికి అవసరమైన విజ్ఞానాన్ని వేదాంగాలు అంటారు. ఇవి వ్యాకరణం, జ్యోతిషం, నిరుక్తం, కల్పం,శిక్ష,ఛందస్సు. వేదంలోని విషయాలను కథలలో చెప్పేవి పురాణాలు.ముఖ్యమైనవి 18. ఇవీ వ్యాసుడే సామాన్యులకై చెప్పాడు. న్యాయం, వైశేషికం, సాంఖ్యం, యోగం. మీమాంస, వేదాంతం – ఈ ఆరూ ఆస్తిక దర్శనాలు. వ్యాసుడు పైలుడికి ఋగ్వేదము, వైశంపాయనుడికి యజుర్వేదం, జైమినికి సామవేదం, సుమంతునికి అథర్వ వేదం ఇచ్చాడు. రోమహర్షణునికి పురాణాలు ఇచ్చాడు. ఈయన సూతుడనే పేరుతో తరువాత కాలంలో నైమిశారణ్యంలోశౌనకాది మహర్షులకు పురాణ ప్రవచనాలు ఇచ్చారు
శ్రీకృష్ణుడు మనకి బాగాతెలిసినదైవం. భగవంతుడే మానవునిగా వచ్చాడు. ఈ కలియుగం ఆరంభంలోనే 5000 సం. ముందు వచ్చాడు.మనకు ఆయనను గురించి తెలుసు అనుకుంటాము. కాని ఆయన తత్త్వం మనకు తెలియదు. వ్రేపల్లెలో లీలలు, బృందావనంలో ఆటలు, రాసక్రీడలు, 16000 గోపికలు, రాధ – అంతే మనకు తెలిసినది. ఆయన 125సం.దీర్ఘ జీవితంలో ఇవి కేవలం మొదటి 12 సంవత్సరాల విశేషాలు. ఆయనను అపార్థం చేసుకోవడమే మనకు అర్థమైనది. జారుడు, వెన్నదొంగ, మానినీచిత్తచోరుడు — ఇవి మనం ఆయనకు ఇచ్చిన బిరుదులు. వీని పరమార్థమూ మనకు తెలియదు. సద్గురుబోధనుండి సేకరించినవి – తెలియవచ్చినంత తేట పరతు.
అసలు శ్రీకృష్ణుడు ఎవరు? భాగవతం, హరివంశం, మహాభారతం, బ్రహ్మవైవర్తపురాణం చదివితే ఆయన వృత్తాంతం తెలుస్తుంది. దశవతారాలలో ఆయన ఉన్నాడా? లేకపోతే దశావతారాలు ఏమిటి? కృష్ణస్తు భగవాన్ స్వయం – అని వ్యాసుడు ఎందుకు అన్నాడు? జయదేవుని అష్టపదులు చెప్పినది ప్రమాణంకాదు. ఫరశురాముడు, శ్రీరాముడు, బలరాముడు మాత్రమే విష్ణువు దశావతారాలలోనికి వస్తారు. అవి విష్ణువు అంశలు. కృష్ణావతారం అంటాము కాని అది కృష్ణుడి స్వయం అవతరణ. ఈ కృష్ణుడికి, విష్ణువుకి సంబంధం ఏమిటి?
కృష్ణుడు-విష్ణువు వీరిసంబంధం తెలియాలంటే మత్స్యావతారంనుండి శ్రీరామునివరకూ గల అవతారాలనూ శ్రీకృష్ణుని ప్రత్యేకతనూ పరిశీలించాలి. సృష్టిలో ద్వంద్వాలు ఎప్పుడూ ఉంటాయి. దేవతలను సృష్టించిన పరమేశ్వరుడే, రాక్షసులనీ సృష్టించాడు. పూర్వయుగాలలో రాక్షసులూకూడా తపస్సులుచేసి లోకకంటకులైనప్పుడు, విష్ణువు ఒకొక అవతారంలో ఒకొక బలీయమైన దుష్టశక్తిని పరిమార్చాడు. క్రితము ద్వాపరయుగంనాటికి అటువంటి రాక్షసులు లేరు. రాక్షసత్వం, కౄరత్వం, అధర్మం చాలామందిలో ప్రవేశించింది. కంస, జరాసంధ, శిశుపాలాదులు కృష్ణుని బంధువులే. అజ్ఞానంకూడా అనేకంగా వ్యాపించింది. కృష్ణుని పాత్ర 125 సంవత్సరాల వ్యవహారం. పైగా అది యుగాంతం. సమాజ ప్రక్షాళన అతడి కార్యక్రమమైనది. రాక్షస సంహారము విష్ణుతత్త్వమైతే అనేక ఇతరదేవతల అంశలను కూడా తీసుకుని కృష్ణుడు వచ్చాడు. ఈ కృష్ణుడు త్రిమూర్తులలో విష్ణువు కాదు. పరాశక్తి, శివుడు, సుబ్రహ్మణ్యుడు ఇలా అనేక దేవతల సంగమం ఆయన.