ఆషాఢమాసంలోని అమావాస్యను చుక్కల అమావాస్య అని అంటారు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఈనాడు కొత్తగా పెళ్ళైన కోడళ్లు ‘చుక్కల అమావాస్య’ పేరుతో ఒక నోముని నోచుకుంటారు. ఈ వ్రతానికి ప్రధానదైవం గౌరీదేవి.
ఒకపీటపై సున్నంతో మొదటి సంవత్సరం వంద చుక్కలు పెట్టి వాటి మీద వంద దారపు పోగులను ఉంచుతారు. బియ్యం పిండితో చేసిన వంద చుక్కలను నివేదిస్తారు. ఈ సంఖ్య సంవత్సరానికో వంద చొప్పున పెరిగి ఐదో సంవత్సరం ఐదువందలకు చేరుతుంది. ఆ దారపు పోగులను ఒక దండగా అల్లుకుని మర్నాటి వరకూ ధరిస్తారు. కొంతమంది నక్షత్ర దర్శనం అయ్యాకే భోజనం చేస్తారు.
ఐదు సంవత్సరాల వరకు ఆచరించే ఈ వ్రతంలో చివరి సంవత్సరం ఉద్యాపనగా స్తోమత ఉన్నవారు బంగారపు చుక్కలను కూడా దానం చేస్తారు. తమ మాంగళ్యం కళకాలం నిలచి ఉండాలని గౌరమ్మ ను వేడుతారు.
ఈనాడు దీపపూజ చేయడం కూడా కనిపిస్తుంది. అషాఢమాసంతో సూర్యుడు దక్షిణాయనానికి మరలుతాడు. రాత్రివేళలు పెరుగుతాయి, చలి మొదలవుతుంది. చలి, చీకటి అనేవి అజ్ఞానానికి, బద్ధకానికీ, అనారోగ్యానికీ చిహ్నాలు. వాటిని పారద్రోలి వెలుగుని, వేడిని ఇచ్చేవి దీపాలు. అందుకు సూచనగా దీపపూజని చేస్తారు. ఇందుకోసం పీటలు లేదా చెక్కపలకలని శుభ్రంగా అలికి, వాటి మీద ముగ్గులు వేస్తారు. ఆ పలకల మీద ఇంట్లో ఉన్న దీపస్తంభాలు లేదా కుందులను ఉంచుతారు. ఆ దీపాలకు పసుపుకుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు. దీనిని దీపస్తంభ వ్రతమని అంటారు.
అప్పాల శ్యామ ప్రణీత్ శర్మ అవధాని