కలియుగ లక్షణాలు – శివపురాణం

కలియుగం వచ్చిన వెంటనే జరిగేది ఏమిటంటే నరులలో పవిత్రత నశిస్తున్నది. పుణ్యము అంటే పవిత్రకర్మ అని. పవిత్రకర్మలు లేనివారై ప్రతివారూ దురాచారములయందు రతులై ఉంటారు. ఏవి సత్యములో ఆ మాటలపట్ల విముఖత్వం కలిగి ఉంటారు. సత్యము అంటే జరిగినది జరిగినట్లు చెప్పడమే కాదు త్రికాలములలోనూ నిలిచి ఉండు శాస్త్రవిషయము అని అర్థం. శాస్త్ర విషయములయందు విముఖులై ఉంటారు. వారి కాలక్షేపాలు ఎలా ఉంటాయంటే

పరాపవాద నిరాః పరద్రవ్యాభిలాషిణః!
పరస్త్రీసక్త మనసః పరహింసా పరాయణాః!!

ఇక్కడ మొత్తం నాలుగు ’పర’లు చెప్పారండీ. పరులపై నిందలు చేస్తూ, ఆ నిందలే కాలక్షేపాలుగా వెళ్తూ ఉంటారు. పరద్రవ్యములమీద, పరస్త్రీలమీద అభిలాష కలిగి ఉంటారు. పరహింసా పరాయణులై ఉంటారు. ఇదంతా ఎందుకు జరుగుతోంది అంటే కలియుగంలో ఉండే ప్రధాన దోషం

దేహాత్మ దృష్టయా మూఢా నాస్తికాః పశుబుద్ధయః!
మాతృపితృ కృత ద్వేషాః స్త్రీ దేవాః కామకింకరాః!!

సర్వపాపములకూ మూలము దేహాత్మ దృష్టి. అంటే దేహమే నేను అనే ఆలోచన. దానివల్లనే సర్వపాపములూ చేస్తున్నారు దానిని తృప్తిపరచడానికి. దేహానికి అతీతమైనది ఒకటి ఉంది అని చెప్తే వీరికి ఎక్కదు. దానితో మూఢత్వం ఏర్పడి నాస్తికులై చరిస్తారు. నాస్తికులు అంటే
“నాస్తికో వేదనిందకః” అంటారు గౌతములు. వేదనిందకులై శాస్త్రములయందు విశ్వాసము లేనివారై పశుబుద్ధులతో తల్లిదండ్రులపై ద్వేషబుద్ధి కలిగి ఉంటారు. కలియుగంలో స్త్రీలే దేవతలు. కామమునకు కింకరులైపోతారు.

విప్రులు లోభమనే గ్రహానికి లోనైపోతారు. లోభమనే గ్రహం వారిని పట్టి పీడిస్తూ ఉంటుంది. దానితో వారు వేదములను విక్రయిస్తూ ఉంటారు. వేదాది విద్యలనూ ధనార్జనకోసమే నేర్చుకుంటారు. విద్యల ప్రయోజనము ధనము అనే దృష్టి ఏర్పడే యుగం కలియుగం. చిట్టచివరికి పరమార్థాలకు పనికివచ్చే విద్యలను కూడా ధనార్జన దృష్టితో నేర్చుకుంటారు. అంతేకాక ఆ విద్యవల్ల మదం, మదంతో తమను తామే మరచి ప్రవర్తిస్తారు.

త్యక్త స్వజాతి కర్మాణః ప్రాయశః పరవంచకాః!
త్రికాల సంధ్యయా హీనా బ్రహ్మబోధ వివర్జితాః!!

విప్రులు తాము చేయవలసిన కర్మలు విడిచిపెట్టి పరులను వంచిస్తూ తిరుగుతూంటారు. త్రికాలసంధ్యావందనాలు విడిచిపెట్టి బ్రహ్మజ్ఞానము లేకుండా ఉంటారు.

అదయాః పండితం మన్యాస్స్వాచార వ్రతలోపకాః!
కృష్యుద్యమరతాః క్రూర స్వభావా మలినాశయాః!!

దయలేనివారి, పండితులవలె చలామణి అవుతూ, వారి ఆచారాలకీ, వ్రతాలకీ లోపం కలిగిస్తూ ఉంటారు.

క్షత్రియాశ్చ తథా సర్వే స్వధర్మ త్యాగశీలినః!
అసత్సంగాః పాపరతా వ్యభిచార పరాయణాః!!
అశూరా అరణ ప్రీతాః పలాయన పరాయణాః!
కుచౌర వృత్తయశ్శూద్రాః కామకింకరచేత సః!!

క్షత్రియులు స్వధర్మాన్ని విడిచిపెట్టి అసత్పురుషులతో సాంగత్యం చేస్తూ పాపరతులై, ఉంటారు. శూరత్వం ఉండదు. యుద్ధం అనగానే వెనకడుగు వేస్తారు. శత్రువులు ఎంతమంది విజృంభిస్తున్నా చేతకాని మెతకతనం పాలకులలో సంక్రమిస్తుంది. క్షత్రియులు అంటే ఇక్కడ జాతిమాత్రమే అని కాకుండా పాలకులు అని తీసుకోవచ్చు. దొంగలే పాలకులవుతుంటారు/పాలకులు దొంగల వలె ప్రవర్తిస్తూ ఉంటారు. రాబోవు కలియుగ లక్షణాలను మహర్షులు పురాణాలలోనే చెప్పారు. ఇంకా కామకింరులై ఉంటారు.

శస్త్రాస్త్ర విద్యయా హీనాః ధేను విప్రావనేజ్ఘితాః!
శరణ్యావన హీనాశ్చ కామిన్యూతి మృగాస్సదా!!

శస్త్రాస్త్ర విద్యలు ఉండవు. గోవులను హింసిస్తారు. విప్రుల సంపదలపై ఆశలు పడతారు. దేవద్రవ్యాలను భోగిస్తారు.

ప్రజాపాలన సద్ధర్మ విహీనా భోగతత్పరాః

ప్రజాసంహారకా దుష్టా జీవహింసకరాముదా!! హింసాపరాయణులౌతారు.

ఇక వైశ్యులు కూడా వారి ధర్మాలు వారు విడిచిపెట్టి

“కుపథాః స్వార్జన రతాః” – చెడుమార్గాలలో సంపాదించాలని వ్యాపారాలు చేస్తారుట. ఇక్కడ వైశ్యులు అనగా వాణిజ్యవేత్తలు. జన్మతః ప్రాప్తించిన వర్ణములు మాత్రమే కాకుండా, వృత్తిగా చేసేవారు కూడా అన్వయించుకోవాలి. దానికే వ్యాపార ధర్మాలు అని పేరు పెడతారు. మోసంతో వ్యాపారం చేయడం వ్యాపార ధర్మం కాదు.
పైగా “తులాకర్మకువృత్తయః” – తూకాలలో మోసాలు చేస్తూ ఉంటారు.
“గురుదేవ ద్విజాతీనాం భక్తిహీనాః” – గురువుల, వేదవేత్తల, దేవుని పట్ల భక్తిలేనివారై ఉంటారు.శూద్రాదులు స్వధర్మాన్ని విడిచిపెట్టడమే కాకుండా”కుటిలాః ద్విజదూషకాః” – బ్రాహ్మణులను దూషిస్తూ తిరుగుతారు. ధనవంతులైన వారైతే కుకర్మలు చేస్తారు. విద్యావంతులైతే వితండవాదం చేస్తూంటారు.

“స్త్రియశ్చ ప్రాయశో భ్రష్టా భర్త్రవజ్ఞాన కారికాః!” – స్త్రీలు ఎక్కువమంది భ్రష్టాచారులై భర్తను అవమానించడంలోనే ఉత్సాహం చూపిస్తూ ఉంటారు.
“శ్వశురద్రోహ కారిణ్యః” – మామగారింటికి ఎసరు పెట్టే లక్షణాలు ఎక్కువగా కలిగి ఉంటారు.
“నిర్భయా మలినాశనాః” – అధర్మం చేయడంలో తెగింపు ఉంటుంది వారికి. ఒకప్పుడు శుద్ధమైన అన్నం పుట్టింది అంటే స్త్రీవల్లనే. ఆ స్త్రీయే ధర్మ భ్రష్టురాలు అవడంతో మలినాన్ని తింటారు ఇళ్ళల్లో. ఆచార రహితంగా వండే అన్నం మలినం.
“కు హావ భావ నిరతాః కుశీలాః స్వరవిహ్వలాః: – చెడ్డ హావభావములతో, చెడ్డ శీలములతో ప్రవర్తిస్తూ ఉంటారు.

Make any Suggitions